స్థిరమైన ప్రగతే కీలకం
ఏ దేశంలోనైనా ప్రజల జీవితాలు సుఖవంతం కావాలన్నా, కనీస అవసరాలు తీరాలన్నా ఆర్థిక అభివృద్ధి, వృద్ధి చాలా కీలకం. ప్రజల అవసరాలు పెరుగుతున్నప్పుడు సంపద కూడా పెరిగితేనే సమాజం సుఖశాంతులతో ఉంటుంది. అయితే, ఒకదేశం అభివృద్ధి సాధించే క్రమంలో అన్నిరంగాల్లోనూ అనేక మార్పులు జరగటం తథ్యం. ఆ మార్పుల ప్రజలకు తద్వారా దేశం మొత్తానికి వీలైనంతవరకు అనుకూలంగా ఉండేలా మార్చుకొంటూ స్థిరంగా ప్రగతిపథంలో ముందుకు సాగటమే సుస్థిరాభివృద్ధి.
-ప్రాథమిక/ అనాగరిక స్థాయిలో ఉన్న ఒక దేశ ఆర్థికవ్యవస్థ ప్రకృతిలో తనకున్న అనుబంధాన్ని విడదీసుకొని ఒక శాశ్వతమైన స్థితికి లేదా సమతౌల్య స్థితికి చేరుకోవడాన్ని గతిశీలక పురోభివృద్ధి అంటారు.
అంటే మొదటి మెట్టు నుంచి చివరి మెట్టుకు చేరుకునే ప్రక్రియ. గతిశీలకత మొదటిమెట్టుపై ఉన్న వ్యవస్థ, చివరి మెట్టుపై ఉన్న వృద్ధి/ ఆర్థికవృద్ధిని చేరుకోవడానికి చేసే ప్రయాణాన్ని ఆర్థికాభివృద్ధి అంటారు.
-అభివృద్ధి చెందిన దేశాలు నిర్దిష్ట సమయంలో ఆ దేశ వాస్తవిక జాతీయ తలసరి ఆదాయాల్లో వస్తు సేవల ఉత్పత్తిలో సుస్థిరమైన పెరుగుదలను సాధించడం.
-వెనుకబడిన దేశాలు ఆర్థిక వృద్ధి (EG) కోసం లేదా దాన్ని అందుకోవడం కోసం సామాజిక, ఆర్థిక, సంస్థాగత, వ్యవస్థాపూర్వక, సాంకేతిక పరమైన – ప్రగతి శీలకమైన మార్పుల్ని ప్రవేశ పెడుతూ ముందుకు సాగే సుదీర్ఘ ప్రక్రియ.
ఉదా: IACS = అమెరికా
LDCS= ఇండియా అనుకుంటె
-అమెరికాలో ఒక టీవీ తయారు చేయడం దాన్ని అమ్మివేయడం/ ఎగుమతి చేయడం గంటల్లో జరిగే పని.
-కానీ, ఇండియాలో టెక్నాలజీ ముడి పదార్థాలు, నిపుణులు, యంత్రాలు, పెట్టుబడి తయారీకి విద్యుత్ తయారైంది తరలించడానికి రవాణా కమ్యూనికేషన్లు మొదలైనవి అన్ని సమకూర్చుకోవాలి. అయినా కొనేవారు ఉంటారని నమ్మకం లేదు. పైగా అందరికీ నచ్చే టి.వి ప్రోగ్రామ్స్ సృష్టికర్తలు కూడా కావాలి.
-అమెరికాలో ఇవ్వన్నీ ముందే జరిగి ఉంటాయి. వారికి వృద్ధి కావాలి. అంటే టీవీల సంఖ్య రోజురోజుకు పెంచుకోవాలి.
-ఇండియాలో వృద్ధిని అందుకోవడానికి అనేక మార్పులు ప్రవేశపెట్టాలి.
-కాబట్టి.. ED = EG+ మార్పులు
-ఇండియా అమెరికా స్థాయిని చేరుకోటానికి చేసే ప్రయత్నం ఆర్థికాభివృద్ధి. అందుకోసం వ్యవస్థ అనేక దశల్లో ప్రయాణించాలి.
-సైమన్ కుజునెట్స్ అభిప్రాయం ప్రకారం ఒక దేశం మొదట వ్యవసాయాధారిత దేశంగా ఉండి పారిశ్రామిక దశ అందుకొని చివరికి సేవారంగాల వైపు చేరుకోటాన్ని గతిశీలక పురోభివృద్ధి అన్నాడు.
-రోస్తావ్ వృద్ధి దశల సిద్ధాంతం ప్రకారం ఒక దేశం వృద్ధి స్థానానికి చేరుకోటానికి ఐదు దశల్లో కొనసాగుతుంది. అవి.. 1) సంప్రదాయ స్థితి 2) ప్లవన ముందు దశ 3) ప్లవన దశ 4) పరిపక్వత దశ 5) సామూహిక వినియోగ దశ
-కార్ల్మార్క్స్ ప్రకారం ఇవి ఆరు దశలు. అవి.. 1) ఆదిమ సమాజం బానిస వ్యవస్థ 3) భూస్వామ్య వ్యవస్థ 4) పెట్టుబడిదారీ వ్యవస్థ 5) సామ్యవాద సంఘర్షణ 6) కమ్యూనిజం అనేది స్థిరమైన, శాశ్వతమైన సమతౌల్య దశ/పురోభివృద్ధిదశ మార్చటానికి వీలుకాని స్థిరత్వం.
-ఏది ఏమైనా ఆర్థిక వ్యవస్థలు స్థిరంగా ఉండవు. అనేక దశల్లో వాటి ప్రయాణం కొనసాగుతుంది. ఈ ప్రయాణాన్ని గతిశీలత అంటారు.
-ఈ ప్రయాణ వేగాన్ని అనేక అంశాలు నిర్దారిస్తాయి. వాటిని రెండుగా వర్గీకరించవచ్చు.
-ఆర్థికాంశాలు: 1) మూలధన సంచయనం 2) వ్యవసాయంలో మిగులు 3) ఆర్థిక వ్యవస్థ స్వరూపం 4) వర్తక వాణిజ్యాలు 5) విదేశీ వ్యాపారం/ఎగుమతి, దిగుమతులు.
-ఆర్థికేతర అంశాలు: 1) సహజ వనరుల లభ్యత 2) మానవ వనరుల నైపుణ్యం 3) ప్రజల ప్రగాఢమైన అభివృద్ధికాంక్ష 4) విద్య-ఆరోగ్యాలు 5) అవస్థాపనా సౌకర్యాలు 6) సాంకేతిక పరిజ్ఞానం 7) పరిశోధనలు 8) అవినీతి రహిత సమాజం 9) రాజకీయ స్వేచ్ఛ సుస్థిరత.
-ఒక దేశం ఆర్థికాభివృద్ధిని సాధించుకొనే ప్రక్రియలో గతిశీలక మార్పులు అనేకం సంభవిస్తాయి. కొన్ని ప్రజలకు మేలు చేసే మార్పులైతే మరికొన్ని ప్రజలతోపాటు వ్యవస్థకు కూడా కీడు కలిగించే మార్పులు, పరిణామాలు సంభవించవచ్చు. కీడు జరగకుండా ఆర్థికాభివృద్ధి పొందటమే గతిశీలక పురోభివృద్ధి.
గతిశీలక పురోభివృద్ధి – మేలు చేసే అంశాలు
1) పారిశ్రామీకరణ
2) నగరీకరణ
3) సుస్థిర ఆదాయాలు
4) విద్య-వైద్యం, అవస్థాపనా సౌకర్యాల మెరుగుదల
5) పేదరికం-నిరుద్యోగం-అసమానతలు తగ్గడం
6) ప్రజల జీవనప్రమాణాలు మెరుగుపడటం
కీడు చేస్తున్న గతిశీలక అంశాలు
1) పారిశ్రామిక కాలుష్యాలు
2) వలసలు
3) అభివృద్ధి పేరుతో భూసేకరణ సమస్యలు
4) ప్రజలు/గిరిజనులు స్థానభంశ్రం పొందటం
5) నిర్వాసితులు కావటం
6) పునరావాస సమస్యలు
7) కులం, మతం, తెగ, లింగ మొదలైన వాటి పేరున వివక్షలు
8) సామాజిక అసమానతలు
9) ప్రాంతీయ అసమానతలు మొదలైనవి.
పారిశ్రామిక కాలుష్యాలు
-గాలి, నీరు, నేల, సహజవనరులు, మానవ మనుగడకు ప్రత్యామ్నాయాలు లేని ప్రకృతి శక్తులు.
-అత్యాశతో మానవుడు ప్రణాళికారహితంగా చేసే పారిశ్రామీకరణ వల్ల విడుదలైన వ్యర్థాలు, విషపూరిత వాయువుల వల్ల ఈ భూమ్మీద ఉన్న జీవరాశికి అన్ని పనికి రాకుండా- పోతున్నాయి. సిమెంటు, పేపరు, చర్మ, ఫార్మా, ఎరువులు, ఆటోమొబైల్, గ్రానైట్, సున్నపురాయి, థర్మల్ అణు విద్యు త్ కేంద్రాలు.. ఇలా లెక్కకు మించిన పరిశ్రమలు అభివృద్ధి కోసం పుట్టుకొచ్చి తమ కాలుష్యాల ప్రతాపంతో మానవ మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
-వాటి నిర్వహణ సరిగా లేకపోతే లేదా ప్రమాదాలు జరిగితే జరిగే నష్టం అంతాఇంతా కాదు.
-భోపాల్ దుర్ఘటన, చెర్నోబిల్, ఫుకుషిమా దుర్ఘటనలు ఇంకా తమ నీలి మబ్బులను వదిలిపెట్టలేదు.
వలసలు
-జనాభా మార్పులో జనన, మరణాల రేటుతోపాటు వలసలు అత్యంత కీలకమైనవి.
-వ్యక్తులు ఒంటరిగా, కుటుంబంతో, తమ స్వస్థలం, సహజ పర్యావరణాన్ని వదిలి మరో స్థలానికి తాత్కాలికంగా లేదా శాశ్వతంగా వెళ్లడం, నివాసం ఏర్పర్చుకోవడం వలసగా చెప్పవచ్చు.
-ఇది స్వచ్ఛందంగా జరిగితే ఫరవాలేదు, ఒత్తిడివల్ల జరిగితేనే ప్రమాదం. గృహం, విద్య, ఆరోగ్యం, సాంఘిక, సాంస్కృతిక సమస్యలను తెచ్చిపెట్టవచ్చు.
-మహబూబ్నగర్ వలసలు, గల్ఫ్ వలసలు, చేతివృత్తులు, నిరుద్యోగ వలసలు మొదలైనవి.
భూసేకరణ సమస్యలు
-గనులు, సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు థర్మల్, అణువిద్యుత్ కేంద్రాలు, సెజ్లు, ఈపీజెడ్లు, ఫిల్మ్ సిటీలు మొదలైన వాటికోసం ప్రభుత్వాలు పెద్ద మొత్తంలో వ్యవసాయ సాగు భూమిని సేకరిస్తున్నాయి.
-1824, 1857, 1885 చట్టాలు బ్రిటిష్ కాలంలోనే భూసేకరణ నిమిత్తం చేయబడ్డాయి. 1894 చట్టం కొంత సమగ్రతను కలిగి ఉంది.
స్థానభ్రంశం సంబంధిత సమస్యలు
-అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో బలవంతంగా ప్రజల్ని మరీ ముఖ్యంగా గిరిజనులను తరలించడం స్థానభ్రంశం.
-ఎంఎం సెర్నియా, హెచ్ మాధుర్ (2008) అంచనాల ప్రకారం 1988-2008ల మధ్య ప్రపంచవ్యాప్తంగా 800 మిలియన్ల ప్రజలు స్థానభ్రంశానికి గురయ్యారు.
-ఆస్తులు, నివాసం కోల్పోయి ప్రజల భవిష్యత్తుపై రుణాత్మక భారాన్ని మోపడం అసమంజసం.
నిర్వాసితులు – పునరావాసం
-నిర్వాసితులైన ప్రజలకు ఆర్థిక సహాయం అందించి చేతులు దులుపుకోవడం అంత మంచిది కాదు.
-వారికి పునరావాసం, జీవనోపాధి కల్పించడం ప్రభుత్వాల బాధ్యత.
-మన దేశంలో 1951 నుంచి నిర్వాసితులైన వారిలో 75 శాతం మంది ఇప్పటికి పునరావాసం కోసం ఎదురుచూస్తున్నారు. అందులో 40 శాతం ప్రజలు గిరిజన నేపథ్యం ఉన్నవాళ్లు. అక్కడక్కడ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి.
-అండ, ఆసరా కనబడక పోయినప్పుడు నేరస్థులుగా, నక్సలైట్లుగా మారుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి.
-ప్రత్యేక జాతీయ విధానం, యంత్రాంగాన్ని ఇందుకోసం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.
కులం, మతం, తెగ, లింగ విచక్షణలు
-నైతిక, ధార్మిక, మానవతా విలువలను పెంపొందించాల్సిన వ్యవస్థలు
-వర్ణ వ్యవస్థ సృష్టించిన కులం గోడలు మెల్లగా కూలుతున్నాయి. ఆశించదగ్గ పరిణామం జీవి పుట్టుక, చావు, పాపం, పుణ్యం, విశ్వం, ఆధ్యాత్మిక ఆలోచనలకు ఆనవాలమైన అలౌకిక అంశాల పరిజ్ఞానం మతం.
-రాజ్యాంగం ప్రజల మనోభావాలకు పూర్తి మద్దతు ప్రకటించినా అసంఘటిత శక్తుల ద్వారా మతం కాస్త మతతత్వంగా రూపాంతరం చెందుతోంది.
-రాయ్ బర్మన్ కమిటీ (1971) అంచనా ప్రకారం మన దేశంలో తెగలు 427. కానీ 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ సంఖ్య 573. దాదాపు అన్ని రాష్ర్టాల్లో తెగలున్నాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ర్టాలు అధిక సంఖ్యలో తెగలున్నాయి.
-రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో లింగపరమైన అసమానతలు అభివృద్ధి వేగాన్ని మందకొడిగా మారుస్తున్నాయి.
సామాజిక అసమానతలు
-ఒక సమాజ అభ్యున్నతిని కులం, జాతి, మతం, తెగ, లింగ వివక్ష, ఆచారాలు, మూఢనమ్మకాలు, సాంప్రదాయాలు, బాల్యవివాహాలు, అక్షరాస్యత, ఆరోగ్యం, జనాభా, పట్టణీకరణ వంటి విషయాలు నిర్దారిస్తాయి.
-సామాజికాభివృద్ధి-ఆర్థికాభివృద్ధిని నిర్ణయిస్తే, అది మానవాభివృద్ధికి కారణమవుతుంది. అంటే ఈ మూడు అంశా లు ఒకదానిపై మరోటి ఆధారపడి ఉంటాయి. పురోభివృద్ధి ప్రక్రియలో ఈ అంశాల మధ్య సమతుల్యం సాధించాలి.
-ఆర్థికాభివృద్ధి ఎంతసాధించినా సామాజికాభివృద్ధి, మానవాభివృద్ధిలో వెనుకబడితే అసమానతలు కొనసాగుతూ అభివృద్ధి/వృద్ధి వేగాన్ని కుంటుపడేలా చేస్తాయి.
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






