ప్రాంతీయ అసమానతలు- పరిణామాలు
మన దేశంలో కొన్ని రాష్ర్టాలు అభివృద్ధి చెందితే మరికొన్ని వెనకబడి వున్నాయి. ఒకే రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెంది మరికొన్ని వెనకబడి ఉన్నాయి. భారతదేశ అభివృద్ధి సమైక్యతకు మూలాధారం సంతులిత ప్రాంతీయాభివృద్ధి. అందుకే ప్రణాళిక రూపకర్తలు ప్రణాళికాలక్ష్యాల్లో సంతులిత ప్రాంతీయాభివృద్ధిని ఒక లక్ష్యంగా ఎంచుకున్నారు.
ప్రాంతీయ అసమానతలకు కారణాలు
-సహజసిద్ధ అంశాలు
-చారిత్రక అంశాలు
-సహజ వనరులు
-ప్రభుత్వ విధానం
-కేంద్ర ప్రభుత్వ మూలధన పెట్టుబడి
-ప్రాంతీయ ప్రభుత్వాల పాత్ర
-పాలనా వ్యవస్థ
-హరిత విప్లవం
ప్రాంతీయ అసమానతలు-కొలమానాలు
1) రాష్ట్ర తలసరి ఆదాయం 2) పేదరిక స్థాయి 3) మానవ అభివృద్ధి సూచిక 4) పారిశ్రామిక-ఉద్యోగిత 5) సహజ వనరుల లభ్యత, నీటి పారుదల సౌకర్యాలు 6) పట్టణీకరణ
7) విద్యుచ్ఛక్తి వినియోగం 8) బ్యాంకు డిపాజిట్లు
రాష్ట్ర తలసరి ఆదాయం:-
2012-13 ప్రస్తుత ధరల్లో జాతీయ సగటు రూ. 67,839 ఉండగా హర్యానా రూ.1,19,158 అగ్ర స్థానంలో ఉంది, తర్వాత స్థానాల్లో మహరాష్ట్ర రూ. 1,03,991, తమిళనాడు రూ. 98,628, గుజరాత్ రూ. 96,976, కేరళ రూ. 88,527, పంజాబ్ రూ. 84,526, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రూ.78,958, కర్ణాటక రూ. 76,578, జాతీయ సగటు కన్నఎక్కువ తలసరి ఆదాయాలను కలిగి ఉన్నాయి. బీహార్ రూ. 27,202, ఉత్తర ప్రదేశ్ రూ.33,616, అసోం రూ. 40,475, మధ్య ప్రదేశ్ రూ. 44,989, ఒడిశా రూ. 49,241 జాతీయ సగటు కన్న తక్కువ తలసరి ఆదాయాలను కలిగి ఉన్నాయి. ప్రాంతీయ అసమానతలను గుర్తించడానికి రాష్ట్ర తలసరి ఆదాయాన్ని సూచికగా తీసుకుంటే రాష్ర్టాల మధ్య అసమానతలు తెలుస్తాయి కాని రాష్ట్రంలోని ప్రాంతాల మధ్య అసమానతలు తెలుసుకొనడానికి వీలుకాదు.
పేదరిక స్థాయి:
రిజర్వ్ బ్యంక్ ఆఫ్ ఇండియా ప్రచురించిన Hand book of Statistics on the Indian Economy 2013-14 లో 2011-12 సంవత్సరానికిగాను పేదరిక రేఖ దిగువన 21.9 % దేశ జనాభా ఉండగా అతి తక్కువ పేదరిక రేఖ దిగువన జనాభా వున్నరాష్ర్టాలు కేరళ (7.1%), హిమాచల్ప్రదేశ్ (8.1%), పంజాబ్ (8.3%), ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (9.2%) హర్యానా (11.2%). కాగా అతి ఎక్కువ పేదరిక రేఖ దిగువన జనాభా ఉన్న రాష్ర్టాలు బీహార్ (33.7%), ఒడిశా (32.6%), అసోం (32%), మధ్య ప్రదేశ్ (31.7%), ఉత్తర ప్రదేశ్ (29.4%).
మానవ అభివృద్ధి సూచిక:
ప్రాంతీయ అసమానతలను పరిశీలించేటప్పుడు ఆదాయ అసమానతలకు ఇచ్చిన ప్రాధాన్యతను మానవ అభివృద్ధిని నిర్ణయించే అంశాలైన అక్షరాస్యత, లింగ నిష్పత్తి, శిశు మరణాలు మొదలైన వాటికి గూడా ఇవ్వాల్సి ఉంటుంది.
-2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశ అక్షరాస్యత 74.04% కాగా 93.91% తో కేరళ మొదటి స్థానంలో ఉండడమే గాకుండా స్త్రీల అక్షరాస్యత 91.98%, స్త్రీల జనాభా ప్రతి 1000 మంది పురుషులకు 1084, శిశు మరణాల రేటు ప్రతి 1000 కి 12 (2009) గా ఉంది. అక్షరాస్యతలో బీహార్ 63.82%తో, స్త్రీల అక్షరాస్యతలో రాజస్థాన్ 52.66%తో, స్త్రీల జనాభా హర్యానాలో 877తో, శిశు మరణాలు ప్రతి 1000కి 67తో చివరి స్థానాలలో ఉన్నాయి. బీమారు రాష్ర్టాలైన బీహార్, మధ్యప్రదేశ్, అసోం, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ల్లో వృద్ధి రేటులో మెరుగుదల ఉన్నప్పటికీ, మానవాభివృద్ధిని నిర్ణయించే సూచికల్లో మెరుగుదల లేదు. తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న రాష్ర్టాలైన హర్యానా, పంజాబ్ల్లో అక్షరాస్యత, స్త్రీల జనాభా విషయంలో ప్రతికూల గణాంకాలు నమోదైనాయి. మానవాభి వృద్ధి 2007-08 లో జాతీయ స్థాయి 0.467 ఉండగా, కేరళ (0.790), డిల్లీ (0.750), హిమాచల్ ప్రదేశ్ (0.652), గోవా (0.617), పంజాబ్ (0.605)లతో మొదటి ఐదు స్థానాల్లో ఉండగా, చత్తీస్గఢ్(0.358), ఒడిశా(0.362), బీహార్ (0.367), మధ్యప్రదేశ్ (0.375), జార్ఖండ్ (0.376)లతో చివరి స్థానాల్లో ఉన్నాయి.
పారిశ్రామికాభివృద్ధి-ఉద్యోగిత:
మన దేశంలో పారిశ్రామికాభివృద్ధిలో తీవ్రమైన అసమానతలున్నాయి. స్వాతంత్య్రానికి పూర్వం, స్వాతంత్య్రం తర్వాత పరిస్థితుల్లో పెద్ద మార్పు లేదు. పారిశ్రామిక స్థిర మూలధనంలో పశ్చిమ రాష్ర్టాలైన మహరాష్ట్ర, గుజరాత్ల్లో 34.60%, పశ్చిమ బెంగాల్ 24.65% అనగా 59.25% కలిగి ఉన్నాయి. ఈ రెండు ప్రాంతాలు 63.03% ఉద్యోగిత, 63.95% పారిశ్రామికోత్పత్తి కలిగి ఉండటం తీవ్రమైన అసమానతలను తెలియజేస్తుంది.
సహజ వనరుల లభ్యత, నీటి పారుదల సౌకర్యాలు:
పంజాబ్, హర్యానా మొదలైన రాష్ర్టాల్లో నీటి పారుదల సౌకర్యాలు, సహజ వనరులు ఎక్కువగా అందుబాటులో ఉండటం వలన వ్యవసాయం అభివృద్ధి చెందింది. ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ల్లో కొన్ని ప్రాంతాల్లో కూడా వ్యవసాయం అభివృద్ధి చెందింది.
పట్టణీకరణ:
అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో పట్టణీకరణ జరిగి పట్టణ జనాభా ఎక్కువగా ఉంటున్నది. జాతీయ స్థాయి పట్టణ జనాభా 31.2% కాగా తమిళనాడు (48.4%),మహరాష్ట్ర (45.2%), గుజరాత్ (42.6%), కర్ణాటక (38.6%), పంజాబ్ (37.5%) మొదలైన రాష్ర్టాల్లో పట్టణ జనాభా ఎక్కువగా ఉంది. బీహార్(11.3%), అసోం (14.1%) ఒడిశా (16.7%), ఉత్తరప్రదేశ్(22.3%) వంటి రాష్ర్టాల్లో పట్టణ జనాభా తక్కువగా ఉంది.
విద్యుచ్ఛక్తి వినియోగం:
తలసరి విద్యుచ్ఛక్తి వినియోగం ప్రాంతీయ అసమానతలను తెలియజేస్తుంది. 2009-10 గణాంకాల ప్రకారం జాతీయస్థాయి తలసరి విద్యుచ్ఛక్తి వినియోగం 121.2 కిలోవాట్లు కాగా ఢిల్లీ 508.8, పంజాబ్ 257.3, తమిళనాడు 208.5 కిలోవాట్లు ఉండగా బీహార్లో 20.5, ఉత్తరప్రదేశ్ 83.4, మధ్యపదేశ్73.4 కిలోవాట్లు మాత్రమే ఉంది.
వాణిజ్య బ్యాంకుల డిపాజిట్లు:
జాతీయస్థాయిలో తలసరి వాణిజ్య బ్యాంకుల డిపాజిట్లు 2011 మార్చి నాటికి రూ. 33,174 వుండగా ఢిల్లీ రూ. 2,85,400, మహరాష్ట్ర రూ. 82,380 కలిగి ఉండగా బీహార్ రూ. 9,667, అసోం రూ. 16,393 తలసరి వాణిజ్యబ్యాంకుల డిపాజిట్లు కలిగి ఉన్నాయి.
ప్రాంతీయ అసమానతలు – ప్రణాళికలు
-దేశంలోని వెనుకబడిన ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రయివేటు పెట్టుబడులు మళ్లించడానికి వీలుగా ఆ ప్రాంతాల్లో సంస్థలు స్థాపించే పెట్టుబడిదారులకు తగిన ప్రోత్సాహకాలను కల్పించడమే గాకుండా అవస్థాపనా సౌకర్యాలు, సాంకేతిక పరిజ్ఞానం, నీటి వసతి, నైపుణ్యంగల శ్రామికుల లభ్యత మొదలైన సౌకర్యాలను అందుబాటులోనికి తేవలసి ఉంటుంది. ఇందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టాలి
-మొదటి పంచవర్ష ప్రణాళికలో ప్రాంతీయ అసమానతల గురించిన ప్రస్తాన లేనప్పటికీ, రెండో పంచవర్ష ప్రణాళిక నుంచి ప్రాంతీయ అసమానతల తగ్గింపు అవసరాన్ని గుర్తించినారు. ఇందులో వెనుకబడిన ప్రాంతాల్లో పెట్టుబడులు కొనసాగించి సంతులిత ప్రాంతీయాభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు.
-మూడో పంచవర్ష ప్రణాలికలో సంతులిత ప్రాంతీయాభివృద్ధి కొరకు 9 వ అధ్యాయాన్ని ప్రత్యేకంగా పేర్కొనారు.
-నాలుగో పంచవర్ష ప్రణాళికలో గ్రామీణ పేదలకు ప్రయోజనం చేకూర్చడానికి వీలుగా SFDA, MFAL, DPAP, CSRE (Crash Scheme for Rural Employment) మొదలైన కార్యక్రమాలను ప్రవేశ పెట్టారు.
-ఐదో పంచవర్ష ప్రణాళికలో ప్రాంతీయ అసమానతలను తొలగించడం కోసం నాలుగో పంచవర్ష ప్రణాళికలోని కార్యక్రమాలని కొనసాగించినారు.
-ఆరో పంచవర్ష ప్రణాళికలో ప్రాంతీయ అసమానతలను తొలగించడానికి సమగ్ర విధానాన్ని రూపొందించారు. ఇందులో భాగంగా ప్రాంతీయ ప్రణాళికలు, ఉప ప్రణాళికలను అమలు చేసి జాతీయ అభివృద్ధి ప్రణాళికలతో అనుసంధానం చేశారు.
-ఏడో పంచవర్ష ప్రణాళికలో ప్రాంతీయ అభివృద్ధి స్థాయికి రెండు అంశాలను గుర్తించినారు. 1)వ్యవసాయ ఉత్పాదకత, మానవ వనరుల సామర్థ్యం పెంపు 2) ప్రాంతాల మధ్య అసమానతలను తగ్గించడం. వీటికి అనుగుణంగా కార్యక్రమాలను రూపకల్పన చేయడం.
-ఎనిమిదో పంచవర్ష ప్రణాళిక నుంచి ప్రణాళికా వ్యూహం సూచనాత్మక ప్రణాళికకు (Indicative Planning) మారడం మూలాన ప్రాంతీయ అసమానతల తగ్గింపునకు చూపే చొరవ తగ్గినప్పటికీ దీని కొరకు కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేశారు. Hill Areas Development Programme, North Eastern Council, Border Area Development Programme, Desert Development Programme మొదలైనవి.
-తొమ్మిదో పంచవర్ష ప్రణాళిక ముసాయిదాలో ప్రాంతీయ అసమానతలను తొలగించడానికి ప్రయివేటు పెట్టుబడులు దోహదపడలేదని కనుక తక్కువ అభివృద్ధి చెందిన రాష్ర్టాల్లో అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధి కొరకు ప్రభుత్వ పెట్టుబడుల అవసరమని పేర్కొన్నారు. It will be necessary to deliberately bias public investment in infrastructure in favour of the less well of States.
-పదో పంచవర్ష ప్రణాళికలో ప్రాంతీయాభివృద్ధి కోసం రాష్ర్టాలవారీగా వృద్ధి లక్ష్యాలను నిర్ణయించారు.
-పదకొండో పంచవర్ష ప్రణాళికలో వెనుకబడిన ప్రాంతాల కొరకు BRGF (Backward Regions Grant Fund) ఏర్పాటు చేశారు.
-పన్నెండో పంచవర్ష ప్రణాళికలో BRGF నిధుల వినియోగం కోసం కొన్ని మార్గదర్శకాలను రూపొందించారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందని ప్రాంతాల్లో, వ్యవసాయం, దాని అనుబంధ పరిశ్రమలలో, అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధి కార్యక్రమాల్లో నిధులను వినియోగించాలని పేర్కొన్నారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు