రుతుపవనాలు ఎలా ఏర్పడతాయి?
రుతుపవనాలు
- ఎ. భూమి, నీరు భిన్న రీతుల్లో ఉష్ణాన్ని గ్రహించడం, చల్లబడడం
బి. ట్రోపో ఆవరణపై భాగంలో అతివేగంగా వీచే జెట్ వాయు ప్రవాహాలు - 1.వేసవి కాలంలో సముద్రం కంటే భూమి వేడిగాను, శీతకాలంలో చల్లగాను ఉంటుంది.
- వేసవిలో ఆసియా ఖండం వేడెక్కడంవల్ల సైబీరియాపై అల్పపీడనం కేంద్రీకృతం అవుతుంది. కనుక పవనాలు సముద్రంపై నుంచి భూభాగం మీదకు వస్తాయి. ఈ పవనాల్లో నీటి ఆవిరి అధికంగా ఉండడంవల్ల ఇవి వర్షాన్ని కలుగజేస్తాయి.
- ఉత్తరార్ధగోళంలోని సైబీరియాపై ఏర్పడిన అల్పపీడన ప్రాంతాన్ని ఆక్రమించడం కోసం దక్షిణార్ధ గోళంలోని ఆగ్నేయ వ్యాపార పవనాలు పయనించడం ప్రారంభిస్తాయి.
- భూమధ్యరేఖను దాటగానే భూభ్రమణం వల్ల, కొరియాలీస్ ప్రభావం వల్ల ఇవి నైరుతి వ్యాపార పవనాలుగా మారి ఆసియా ఖండంపై వీచి వర్షాన్ని కలుగజేస్తాయి.
- వర్షాన్నిచ్చే శక్తిగల ఈ నైరుతి వ్యాపార పవనాలు, క్రమంగా నైరుతి రుతుపవనాలుగా పిలువబడుతున్నాయి.
- శీతకాలం ప్రారంభంకాగానే ఆసియా ఖండంపై (సైబీరియాపై) అధికపీడనం, హిందూ మహాసముద్రంపై అల్పపీడనం కేంద్రీకృతమై ఉంటాయి. ఈ అల్పపీడనాన్ని ఆక్రమించడం కోసం ఉత్తరార్ధ గోళంలోని ఈశాన్య వ్యాపార పవనాలు వీచడం ప్రారంభించి క్రమక్రమంగా ఈశాన్య రుతుపవనాలుగా రూపుదిద్దుకుంటాయి. భూభాగంపై నుంచి వీచే ఈ పవనాల్లో నీటి ఆవిరి అంతగా ఉండకపోవడంతో అల్ప వర్షాన్ని కలుగజేస్తాయి.
- 2.శీతాకాలంలో ఆసియా ఖండంపై ఏర్పడిన అధిక పీడన ప్రాంతం నుంచి అల్పపీడనం గల హిందూ మహాసముద్రం వైపు ఈశాన్య వ్యాపార పవనాలు వీస్తాయి. ఇవి ఎక్కువ వేగంతో వీయడానికి ట్రోపో ఆవరణంపై భాగంలో ఉన్న పశ్చిమ జెట్ స్ట్రీం దోహదం చేస్తుంది. ఇది రెండు శాఖలుగా చీలి, ఒక శాఖ హిమాలయాలకు ఉత్తరంగాను, మరోశాఖ దక్షిణ దిశకు పయనిస్తూ చైనా తూర్పు తీరంలో కలుస్తాయి. ఈశాన్య వ్యాపార పవనాలు వేగంగా సముద్రంపైకి వీయడానికి ఇవి దోహదం చేస్తాయి.
- రుతపవన వ్యవస్థ భారతదేశంలో ఉన్నంత పటిష్ఠంగా మరే ప్రాంతంలోనూ లేదనే చెప్పాలి. ఇది ప్రధానంగా రుతుపవన దేశం. అంతేకాదు, రుతుపవనాల వల్ల వర్షం పొందే దేశాల్లో ప్రధానమైంది, పెద్దది భారతదేశమే.
- అందువల్లనే భారతదేశ శీతోష్ణస్థితికి ఆయనరేఖా రుతుపవన శీతోష్ణస్థితి అని పేరు. భారతదేశం రుతపవన ఆసియాలో రుతుపవన మండలంలో ఉంది,
- రుతుపవనాల వల్ల వర్షం పొంది జీవగర్రగా ప్రపంచ దేశాలతో కొనియాడబడుతున్నది. ఇది రుతపవన దేశంగా మారడానికి ప్రకృతి ప్రసాదించిన వరాలే మిన్న అని చెప్పక తప్పదు.
కారణాలు
1.భారతదేశం అక్షాంశపరంగా ఉత్తరార్ధగోళంలోనూ రేఖాంశాలపరంగా పూర్వార్ధగోళంలోనూ ఉండడం వల్ల భారతదేశానికి ఇరువైపులా భూ, జల విస్తరణ ఇంచుమించు సమానంగా ఉండి పీడన వ్యవస్థలో మార్పులు జరిగి రుతుపవన వ్యవస్థకు నాంది పలికాయి.
2.కర్కటకరేఖ భారతదేశం మధ్యలో నుంచి పోవడంవల్ల సూర్యగమనంలో మార్పుల ప్రభావానికి లోనైంది.
3.భారతదేశానికి ఉత్తరంగా పెద్ద భూభాగమైన ఆసియా ఖండం, దక్షిణాన పెద్ద జలభాగమైన హిందూ మహాసముద్రం అమరి ఉన్నాయి. ఈ రకమైన అమరిక ప్రపంచంలో మరెక్కడా లేదు. అందువల్ల నేల, నీరు, విభిన్న రీతుల్లో ఉష్ణోగ్రతను గ్రహించి, చల్లబడడం వల్ల రుతుపవన వ్యవస్థకు అంకురార్పణ జరిగింది.
4.రుతుపవనాలు పయనించే దారిలో ప్రథమ దేశంగా పెద్ద భూభాగంగా ఉండడం.
5.ప్రపంచంలో పెద్ద పర్వాతాలైన హిమాలయాలు భారతదేశ ఉత్తర దిక్కు పెట్టునికోటవలె ఉండి రుతుపవనాలను అడ్డగించి దేశానికి వర్షం ఇవ్వడానికి తోడ్పడుతున్నాయి. హిమాలయాలు లేకపోతే మాసిన్రాంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యేది కాదు.
6.కన్యాకుమారి అగ్రం వింతైన ఆకారం వల్ల రుతుపవనాలు రెండు శాఖలై ఏ ప్రాంతాన్ని వదలక వర్షాన్నిస్తున్నాయి.
7.దేశం మూడు వైపుల సముద్రం కలిగి ఉండడం రుతుపవనాల విషయంలో శుభపరిణామం.
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?