రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న మహిళా ప్రతినిధి ఎవరు?
![](https://s3.ap-south-1.amazonaws.com/media.nipuna.com/wp-content/uploads/2022/04/nipuna-2-7.jpg)
- భారత ప్రభుత్వ చట్టం-1919 (మాంటెగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు)
- మాంటెగ్ భారత రాజ్య కార్యదర్శి
- చేమ్స్ఫర్డ్-వైస్రాయ్
- భారతదేశంలో బాధ్యతయుత పరిపాలన ప్రవేశపెట్టడం లక్ష్యంగా పేర్కొన్నారు.
- వైస్రాయ్ కార్యనిర్వాహక వర్గంలో భారతీ యసభ్యుల సంఖ్యను మూడుకు పెంచారు.
- ఈ చట్టాన్ని అనుసరించి భారతదేశంలోని రాష్ర్టాలలో తొలిసారిగా ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని ప్రవేశపెట్టారు.
- ద్విసభా విధానం అనగా ఎగువ సభ, దిగువసభ.
- దిగువ సభ మొదటి చైర్మన్- వీజే పటేల్
- ఎగువసభ మొదటి ఛైర్మన్-సర్ ఫ్రెడరిక్ వైట్
- ఈ చట్టాన్ని అనుసరించి సిక్కులకు ఆంగ్లో ఇండియన్లకు, భారతీయ క్రైస్తవులకు తొలిసారిగా ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించారు. ఈ చట్టాన్ని అనుసరించి దౌత్య వ్యవహారాల నిర్వాహణకు భారత హై కమిషనర్ అనే పదవి నూతనంగా సృష్టించారు.
- ఈ చట్టాన్ని అనుసరించే రాష్ట్ర బడ్జెట్ను కేంద్ర బడ్జెట్ నుండి వేరు చేశారు. రాష్ట్ర బడ్జెట్ను చర్చించి ఆమోదించుకునే అధికారం ఆ రాష్ట్ర శాసనసభకు ఇచ్చారు. దేశంలో ఉద్యోగాల భర్తీకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఏర్పాటు చేయాలని చట్టంలో సూచించారు.
- ఈ చట్టాన్ని అనుసరించి భారతదేశంలో తొలిసారిగా బాధ్యతాయుత ప్రభుతాన్ని ప్రవేశ పెట్టారు
1927 సైమన్ కమిషన్
1919 చట్టాన్ని సమీక్షించేందుకు బ్రిటిష్ ప్రభుత్వం సైమన్ అధ్యక్షతన ఆరుగురు సభ్యులతో 1927లో ఈ కమిషన్ ఏర్పాటు చేసింది. సైమన్ కమిషన్ 1927 ఫిబ్రవరి 3వ తేదీన భారతదేశాన్ని సందర్శించింది. ఈ కమిషన్లో భారతీయులు ఎవరూ లేనందున ఈ కమిషన్ను తిరస్కరించారు. ఈ కమిషన్ ఏక పక్షంగా భారత్లో రాష్ర్టాలను సందర్శించి ఒక నివేదికను తయారు చేసి 1930లో బ్రిటిష్ ప్రభుత్వానికి సమర్పించింది.
సైమన్ కమిషన్ సిఫారసులు
1. సైమన్ కమిషన్ నివేదికలను 3 రౌండ్ టేబుల్ సమావేశాల్లో సమీక్షించారు.
2. రాష్ర్టాలలో ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేసి బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టాలని కమిషన్ చూచించింది.
నెహ్రూ నివేదిక (1928)
భారత వ్యవహారాల కార్యదర్శి లార్డ్ బిర్కెన్ హెడ్ 1927 నవంబర్లో బ్రిటన్ ఎగువసభలో మాట్లాడుతూ అందరికీ సమ్మతమైన రాజ్యాంగాన్ని భారతీయులు రూపొందించగలరా? అని సవాలు విసిరారు. ఈ సవాలును స్వీకరించిన భారత జాతీయ కాంగ్రెస్ 1928 మే 19న బొంబాయిలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. 1928 ఆగస్టు 10న రాజ్యాంగ రచనకు మోతీలాల్ నెహ్రూ అధ్యక్షుడిగా 8 మంది సభ్యులతో కూడిన ఉపసంఘాన్ని నియమించింది. పండిట్ జవహార్లాల్ నెహ్రూ దీనికి కార్యదర్శిగా పనిచేశారు.
ముఖ్యాంశాలు
- భారతదేశానికి డొమినియన్ స్వయం ప్రతిపత్తి ఇవ్వడం
- భాషాప్రయుక్త రాష్ర్టాలు, స్వయం ప్రతిపత్తి రాష్ర్టాలు అనే అంశాల ఆధారంగా దేశంలో సమాఖ్య వ్యవస్థను ఏర్పాటు చేయడం.
- అల్ప సంఖ్యాక వర్గాల వారికి శాసనమండళ్లలో కనీసం 10 సంవత్సరాలపాటు కొన్ని స్థానాలను కేటాయించడం.
- 19 ప్రాథమిక హక్కులను కల్పించడం
- గమనిక : మొదటిసారిగా ప్రాథమిక హక్కులను సూచించింది. నెహ్రూ రిపోర్టు
- 1929లో బ్రిటన్లో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సైమన్ నివేదిక భారత్లో రాజ్యాంగపరమైన సంస్కరణలపై చర్చించడానికి రౌండ్టేబుల్ సమావేశాలను ఏర్పాటు చేశారు.
- నాటి బ్రిటన్ ప్రధానమంత్రి రామ్సే మెక్డోనాల్డ్ చొరవతో రాజప్రతినిధి(వైస్రాయ్) ఇర్విన్ను ఇంగ్లండ్కు రప్పించారు.
- భారతీయుల సమస్యల గురించి చర్చించడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తుందని, అందులో పాల్గొనడానికి అన్ని పార్టీలు, వర్గాలకు ఆహ్వానం వస్తుందని మెక్డోనాల్డ్ ఒక ప్రకటన చేశారు.
మొదటి రౌండ్ టేబుల్ సమావేశం
1930 నవంబర్ 12 నుంచి 1931 జనవరి 19 వరకు మొదటి రౌండ్ టేబుల్ సమావేశం లండన్లో జరిగింది. ఇందులో 89 మంది ప్రముఖ రాజనీతిజ్ఞులు పాల్గొన్నారు. కానీ భారత జాతీయ కాంగ్రెస్ పాల్గొనలేదు. ఈ సమావేశంలో భావి భారత రాజ్యాంగం సమాఖ్యగా ఉండాలా? లేదా ఏక కేంద్రంగా ఉండాలా? అనే అంశంపై చర్చించారు. కాంగ్రెస్ పాల్గొనకపోవడం వల్ల చర్చలో వాస్తవమైన ప్రగతి సాధ్యం కాలేదు. సమావేశంలో పాల్గొనని ప్రజావర్గాల సహకారం కోసం చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రధానమంత్రి మెక్డోనాల్డ్ సమావేశాన్ని ముగించారు.
మొదటి రౌండ్టేబుల్ సమావేశంలో ముస్లింలీగ్ తరుపున జిన్నా, ఆగాఖాన్, మహ్మద్ ఆలీ, మహ్మద్ షా, ఫజల్ హక్బీ హిందూ మహాసభ తరపున తేజ్ బహుదూర్ సప్రూ, చింతామణి, శ్రీనివాస శాస్త్రి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, హైదరాబాద్ దివాన్ అక్బర్ హైదర్ పాల్గొన్నారు.
రెండో రౌండ్ టేబుల్ సమావేశం
1931 సెప్టెంబర్ 7 నుంచి డిసెంబర్ 7 వరకు లండన్లో రెండో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇర్విన్తో చేసుకున్న ఒడంబడిక ప్రకారం కాంగ్రెస్ తరపున గాంధీజీ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇందులో అన్ని స్వదేశీ సంస్థానాధిపతులతో పాటు 107 మంది సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి మహిళా ప్రతినిధిగా సరోజినీ నాయుడు, బలహీన వర్గాల తరపున డాక్టర్ బీఆర్ అంబేద్కర్ హాజరయ్యారు. ఈ సమావేశంలో ముస్లిం వర్గాలకు రెండు కొత్త ప్రావిన్సులను (నార్త్ వెస్ట్ ప్రావిన్స్, సింధ్) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. గాంధీజీ దీన్ని ‘విభజించు పాలించు’ విధానంగా భావించి తీవ్రంగా వ్యతిరేకించారు. అల్ప సంఖ్యాక-వర్గాల సమస్యపై ఈ సమావేశం ఏకాభిప్రాయానికి రాలేకపోయింది. బ్రిటిష్ ప్రధానమంత్రి, తాను దారులు వేరయ్యే చోటుకే వచ్చానని గాంధీజీ ప్రకటించారు.
కమ్యూనల్ అవార్డు (1932)
మైనారిటీ వర్గాల ప్రాతినిధ్యానికి సంబంధించి నాటి బ్రిటన్ ప్రధాని రామ్సే మెక్డొనాల్డ్ 1932 ఆగస్టు 4న ఒక ప్రతిపాదన చేశారు. దీన్ని కమ్యూనల్ అవార్డు అంటారు. దీని ప్రకారం ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్లకే కాకుండా షెడ్యూల్డ్ కులాలకు కూడా ప్రత్యేక నియోజక గణాలను ప్రతిపాదించారు. దీన్ని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సమర్థించారు. మహాత్మాగాంధీ దీన్ని వ్యతిరేకిస్తూ పుణేలోని ఎరవాడ కారాగారంలో 1932 సెప్టెంబర్ 20న అమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. రాజాజీ, మదన్ మోహన్ మాలవ్య లాంటి నాయకులు చొరవ తీసుకొని అంబేద్కర్, గాంధీజీతో చర్చించి దీక్షను విరమింపజేశారు. 1932 సెప్టెంబర్లో పుణే ఒప్పందం కుదిరింది. తద్వారా కమ్యూనల్ అవార్డు కంటే ఎక్కువగా షెడ్యూల్డ్ కులాలకు అవకాశాలు లభించాయి.
మూడో రౌండ్ టేబుల్ సమావేశం
1932 నవంబర్ 17 నుంచి డిసెంబర్ 24 వరకు లండన్లో మూడో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. బ్రిటిష్ ప్రభుత్వం సమస్యలు సృష్టిస్తారని భావించిన వారెవరికి ఆహ్వానం పంపలేదు. అందువల్ల కాంగ్రెస్ ప్రతినిధులు సమావేశానికి హాజరుకాలేదు. ఇంగ్లండ్లోని లేబర్ పార్టీ కూడా దీనికి సహకరించలేదు. ఇందులో అంతకు ముందు నియమించిన ఉపసంఘాల నివేదికలపై చర్చించారు. ఈ సమావేశంలో చేసిన సిఫార్సులకు సంబంధించిన అనేక అంశాలను 1935 భారత ప్రభుత్వ చట్టంలో పొందుపరిచారు. ఈ సమావేశానికి కేవలం 46 మంది ప్రతినిధులు మాత్రమే హాజరయ్యారు.
భారత ప్రభుత్వ చట్టం 1935
బ్రిటిషర్లు రూపొందించిన రాజ్యాంగ సంస్కరణ చట్టాలన్నింటిలో ఇది వివరణాత్మకమైనది. సుదీర్ఘమైనది. 1937 ఏప్రిల్ నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఈ చట్టంలో 321 ప్రకరణలు, 10 షెడ్యూళ్లు, 14 భాగాలు ఉన్నాయి.
చట్టంలోని ముఖ్యాంశాలు
- అఖిల భారత సమాఖ్య ఏర్పాటుకు నిర్ణయించారు. ఇందులో 11 ప్రాంతాలు, 6 ఛీఫ్ కమిషనర్ల ప్రాంతాలు, సమాఖ్యలో చేరడానికి అంగీకరించిన స్వదేశీ సంస్థానాలు ఉంటాయి.
- కేంద్రం, రాష్ర్టాల మధ్య 3 జాబితాల ప్రకారం అధికార విభజన ఉంటుంది. కేంద్ర జాబితాలో 59, రాష్ట్రజాబితాలో 54, ఉమ్మడి జాబితాలో 36 అంశాలుంటాయి.
- అవశిష్ట అధికారాలను వైస్రాయ్కి ఇచ్చారు. స్వదేశీ సంస్థానాలు ఈ సమాఖ్యలో చేరకపోవడం వల్ల ఇది అమల్లోకి రాలేదు.
- రాష్ర్టాల్లోని ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దుచేసి కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రతిపాదించారు.
- కేంద్రంలో పాలనాంశాలను రిజర్వ్డ్, ట్రాన్స్ఫర్డ్ అంశాలుగా విభజించారు.
- గవర్నర్ జనరల్ రిజర్వ్డ్ అంశాలను తాను నియమించిన ముగ్గురు కౌన్సిలర్ల సహాయంతో పాలిస్తాడు.
- ట్రాన్స్ఫర్డ్ అంశాల కోసం ఒక మంత్రి మండలిని నియమించి, దీని సహాయంతో పాలనను పర్యవేక్షిస్తారు. ఈ మంత్రి మండలిలో సభ్యులు 10 మందికి మించకూడదు.
- రాష్టస్థాయిలో ద్విసభా పద్ధతిని ప్రవేశపెట్టారు. దేశంలోని మొత్తం 11 రాష్ర్టాలకు గాను ఆరు (బెంగాల్, బొంబాయి, మద్రాసు, బీహార్, అస్సాం, యునైటెడ్ ప్రావిన్స్) రాష్ర్టాల్లో దీన్ని ప్రవేశపెట్టారు.
- భారతరాజ్య కార్యదర్శికి ఉన్న కౌన్సిల్ను రద్దుచేశారు. ఇతడికి సహాయంగా ముగ్గురికంటే తక్కువ కాకుండా ఆరుగురికి మించకుండా సలహాదార్లను నియమించారు.
- కేంద్ర శాసనసభల పరిమాణాన్ని పెంచారు. సభ్యుల సంఖ్యను ఎగువ సభ (కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్)లో 260కి దిగువ సభ (లెజిస్లేటివ్ అసెంబ్లీ) 375కు పెంచారు.
- కమ్యూనల్ ప్రాతినిధ్యాన్ని కొనసాగించారు. ఈ సదుపాయాన్ని షెడ్యూల్డ్ కులాలవారికి, మహిళలకు వర్తింపజేశారు.
- ఓటు హక్కును విస్తృతపరిచారు. జనాభాలో 10 శాతం మందికి ఓటు హక్కు వర్తింపజేశారు.
- కేంద్ర, రాష్ర్టాల మధ్య సమాఖ్య వివాదాలను పరిష్కరించడానికి ఫెడరల్ కోర్టు (సుప్రీంకోర్టు)ను ఏర్పాటు చేశారు. ఇందులో ఒక ప్రధాన న్యాయమూర్తి, ఆరుగురు ఇతర న్యాయమూర్తులు ఉంటారు. అయితే దీని తీర్పులే సర్వోన్నతం కాదు. వీటిపై ఇంగ్లండులో ఉండే ప్రివికౌన్సిల్కు అప్పీల్ చేసుకోవచ్చు.
- ఈ చట్టం ద్వారా బర్మాను భారతదేశం నుంచి వేరు చేశారు. అదేవిధంగా ఒరిస్సా, సింధ్ అనే రెండు కొత్త ప్రావిన్సులను ఏర్పాటు చేశారు. బ్రిటిష్ ఇండియాపై బ్రిటిష్ పార్లమెంట్ సర్వాధిపత్యాన్ని పునరుద్ఘాటించారు.
- కేంద్రంలో ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ర్టాల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్లను ఏర్పాటు చేశారు. భారతదేశంలో విత్త విధానం, రుణ నియంత్రణ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను స్థాపించారు.
చట్టం ప్రాముఖ్యత
ఈ చట్టం ద్వారా పొందుపరిచిన అత్యంత ముఖ్యమైన అంశం ‘ప్రాంతాల స్వయం ప్రతిపత్తి’ దీని ద్వారా మొదటిసారిగా రాష్ర్టాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. ప్రాంతీయ పాలనాంశాలన్నింటినీ మంత్రుల ఆధీనంలోకి బదిలీ చేశారు. కేంద్రం నియంత్రణ చాలా వరకు తగ్గింది. గవర్నర్లను రాష్ర్టాలకు రాజ్యాంగబద్దమైన అధిపతులుగా పరిగణించారు.
వాఖ్యానాలు
- బానిసత్వానికి ఒక నూతన చట్టాన్ని భారతదేశంపై బలవంతంగా రుద్దారు.
“ఇంజన్ లేకుండా కేవలం గట్టి బ్రేకులున్న యంత్రం” – జవహార్ లాల్ నెహ్రూ - ‘భారతదేశంలో గోచరించే భ్వూస్వామ్య వ్యవస్థను దృఢం చేయడానికి బ్రిటిష్ పాలకులు ఆడిన నాటకం’ – సుభాష్ చ్రందబోస్
- కచ్చితంగా పిచ్చింది. సమూలంగా పెద్దది మొత్తానికి అనంగీకారమైంది. – జిన్నా
- ఈ చట్టాన్ని మా మీద బలవంతంగా రుద్దారు. బాహ్యంగా దీనికి కొంత ప్రజాస్వామ్య రూపం ఉన్నట్లు కనిపించినా లోపల మాత్రం అంతా శూన్యం – పండిట్ మదన్మోహన్ మాలవ్య
- ఈ చట్టం ద్వారా వైస్రాయ్కి ముస్సోలిని, హిట్లర్ను తలపించే నియంతృత్వ అధికారాలు ఇచ్చారు. ఇది పొట్టి మనుషులు కట్టిన అవమానకరమైన గొప్ప కట్టడం – విన్సట్టన్ చర్చిల్
లిన్లిత్గో ఆగస్టు ప్రతిపాదనలు
భారత వైస్రాయ్ లార్డ్ లిన్ లిత్గో 1940 ఆగస్టు 8న కొన్ని ప్రతిపాదనలు చేశాడు.
ముఖ్యాంశాలు:
- రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత భారతదేశానికి డొమినియన్ ప్రతిపత్తి కల్పించే విషయాన్ని పరిశీలిం చడం. రాజకీయపార్టీల ప్రాతినిధ్యంతో రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేయడం.
వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులకు జనరల్ కార్య నిర్వాహక మండలిలో సభ్యత్వం కల్పించి మండలిని విస్తృతం చేయడం. - రాజ్యాంగ పరిషత్తులో అల్పసంఖ్యాక వర్గాల వారికి సముచిత ప్రాతినిద్యం ఇవ్వడం
అన్ని రాజకీయ పార్టీలు, సంస్థానాల ప్రతినిధులతో కూడిన యుద్ధ సలహా మండలిని ఏర్పాటు చేయడం. - ఈ ప్రతిపాదనలను రాజకీయ పార్టీలు తిరస్కరించాయి.
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు