Indian Polity | జాతీయ పౌర పట్టిక.. భారతీయుల గుర్తింపు వేదిక
14వ తేదీ తరువాయి
ద్వంద్వ పౌరసత్వం (Dual citizenship)
- భారత సంతతికి చెంది ఉండి విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు దేశానికి రాకపోకల దృష్ట్యా వీసాపరమైన ఇబ్బందులు తగ్గించటానికి పౌరసత్వ చట్టం 2005లో కొన్ని మార్పులు చేర్పులు చేశారు.
- ద్వంద్వ పౌరసత్వంలో కొన్ని సదుపాయాలు కల్పించారు. వాటిని కింది విధంగా వివరించవచ్చు.
ప్రవాస భారతీయులు - విదేశాల్లో తాత్కాలికంగా లేదా శాశ్వతంగా నివసిస్తున్న మొదటితరం భారతీయులు. ఈ పదాన్ని ఆర్థిక భావంతో వాడతారు.
- ఇన్కమ్ ట్యాక్స్ చట్టం 1967, ఫారెన్ ఎక్సేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999 ప్రకారం పన్ను చెల్లింపునకు సంబంధించి రెసిడెంట్, నాన్ రెసిడెంట్ పదాలను ఉపయోగిస్తారు.
- 182 రోజులు దేశం బయట నివసిస్తూ ఉంటే వారిని ఎన్ఆర్ఐలు అంటారు. వీరికి భారత పాస్పోర్ట్ ఉంటుంది.
- భారతదేశం రావడానికి వీసా అవసరం లేదు. ఓటు హక్కు ఉంటుంది. భారత సంతతికి చెందినవారు
- విదేశీ పౌరసత్వాన్ని కలిగియున్న రెండోతరం భారతీయులు, అంటే విదేశాలకు వెళ్లి స్థిరపడి ఆ దేశ పౌరసత్వాన్ని పొందిన తల్లిదండ్రులకు జన్మించిన సంతానం. వీరికి వీసా అవసరం. (పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గానిస్థాన్, చైనా, నేపాల్, భూటాన్ దేశాలకు వర్తించదు)
ఉదా: అమెరికాలోని లూసియానా రాష్ర్టానికి గవర్నర్గా ఎన్నికైన బాబీ జిందాల్.
ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా - భారత ప్రభుత్వ చట్టం 1955 ప్రకారం నమోదు చేసుకున్న వ్యక్తులు. ఈ పథకం 2005, డిసెంబర్ 2 నుంచి అమల్లోకి వచ్చింది.
జాతీయ పౌరుల పట్టిక - అస్సాం ప్రాంతంలో నివసిస్తున్న నిజమైన భారతీయులను గుర్తించి వారి పేర్లను నమోదు చేయడానికి ఉద్దేశించిన కార్యక్రమాన్ని జాతీయ పౌరుల పట్టిక అంటారు.
- 19, 20వ శతాబ్దాల్లో అస్సాం బ్రిటిష్ వారి వలస పాలనలో ఉన్నప్పుడు బెంగాల్ ప్రాంతం నుంచి (ప్రస్తుత బాంగ్లాదేశ్) చాలా మంది రైతులు అసోం ప్రాంతాలకు వలస వచ్చారు.
- స్వాతంత్య్రానంతరం చట్ట వ్యతిరేకంగా భారత్కు వలస వచ్చిన వారిని తిరిగి వారి ప్రాంతాలకు పంపడానికి 1950లో ఇమిగ్రెంట్స్ చట్టాన్ని రూపొందించి అలాంటి వారిని గుర్తించేందుకు 1951 జనాభా లెక్కల ఆధారంగా ఒక పట్టికను తయారు చేసే బాధ్యతను కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు అప్పగించారు.
- అక్రమంగా వలస వచ్చిన విదేశీయులను తిరిగి వారి దేశాలకు పంపమని అఖిల అస్సాం విద్యార్థుల సంఘం తీవ్రంగా ఉద్యమం చేసింది.
- ఇందులో భాగంగా 1985లో రాజీవ్గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం విద్యార్థి సంఘంతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీన్ని ‘అస్సాం అకార్డ్’ అంటారు.
- అక్రమంగా వలస వచ్చిన వారిని తిరిగి వారి దేశాలకు పంపివేయడం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది.
- అయితే అది సక్రమంగా అమలు జరగకపోవడం విపరీత జాప్యానికి దారి తీసింది.
- 2013లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని త్వరితగతిన అక్రమ వలసదారులను పంపివేసే కార్యక్రమాను పూర్తి చేయాలని ఆదేశించింది.
- దీంతో కేంద్ర ప్రభుత్వం, అస్సాం ప్రభుత్వం సంయుక్తంగా అక్రమ వలసదారులను గుర్తించేందుకు ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
- 2017లో తాత్కాలిక జాతీయ పౌరుల పట్టిక ముసాయిదాను విడుదల చేశారు.
- సరైన ఆధారం లేనివారిని, కుటుంబ వంశ వృక్షం లేనివారిని ఈ పట్టికలో చేర్చలేదు.
- ఇందులో 19 లక్షల మంది స్థానికత తేలాల్సి ఉంది.
- పౌరసత్వ సవరణ చట్టం-2019
- భారతదేశ పౌరసత్వాన్ని పొందుటకు సంబంధించి విధి విధానాలను రూపొందిస్తూ పార్లమెంటు 1955లో పౌరసత్వ చట్టాన్ని చేసింది.
- ఈ చట్టానికి దేశంలోని పరిస్థితులకు అనుగుణంగా అనేక పర్యాయాలు సవరణలు చేశారు.
- అస్సాంలో జాతీయ పౌర పట్టిక రూపొందించే క్రమంలో సుమారు 19 లక్షల మంది స్థానికతకు అవసరమైన ఆధారాలు లేవు. వీరందరూ కూడా అక్రమ వలసదారులుగా పరిగణించబడతారు.
- ఇలాంటి వారికి సహజీకృత పద్ధతిలో పౌరసత్వాన్ని కల్పించేందుకు 2019లో పార్లమెంటు పౌరసత్వ చట్టానికి కొన్ని సవరణలు చేసింది.
ముఖ్యాంశాలు - పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ దేశాల్లో మత పీడనకు గురై భారతదేశానికి వలస దారులుగా వచ్చిన హిందువులు, బౌద్ధులు, సిక్కులు, జైనులు, క్రైస్తవులకు సహజీకృత పౌరసత్వాన్ని కల్పించటానికి వెసులుబాటు కల్పించింది.
- 2014, డిసెంబర్ 31 నాటికి భారతదేశానికి వచ్చిన వలసదారులకు పౌరసత్వాన్ని కల్పిస్తారు.
- ఇందులో ముస్లింలకు మినహాయింపు ఇచ్చారు. వీరు ఈ మూడు దేశాల్లో మెజారిటీ వర్గానికి చెందినవారు కాబట్టి వారు మత పీడనకు గురయ్యే అవకాశం ఉండదని భావించి వీరిని ఈ చట్టం నుంచి మినహాయించారు.
- సహజీకృత పౌరసత్వాన్ని పొందడానికి అవసరమైన 11 సంవత్సరాలను భారతదేశంలో నివాస షరతులు ఐదు సంవత్సరాలకు తగ్గించారు.
- ఈ చట్టం నుంచి కొన్ని ప్రాంతాలకు మినహాయింపు ఇచ్చారు.
- ఆరో షెడ్యూల్లోని ట్రైబల్ ప్రాంతాలకు ముఖ్యంగా అస్సాం, మేఘాలయ, మిజోరం, త్రిపుర ప్రాంతాలకు వర్తించదు.
- లైన్ పర్మిట్ వర్తించే రాష్ర్టాలకు కూడా ఇది వర్తించదు. (అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరం)
- ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా రిజిస్ట్రేషన్ కార్డు పొందిన వారు కొన్ని కారణాల వల్ల తమ కార్డును కోల్పోతారు.
- అక్రమాలు, రాజ్యాంగం పట్ల అవిధేయత, యుద్ధ సమయంలో శత్రువులకు సహకరించడం, దేశ రక్షణ, సార్వభౌమత్వం, భారత చట్టాలను ఉల్లంఘించడం మొదలైన నేరాలకు పాల్పడి రెండు సంవత్సరాలు శిక్ష పడితే అలాంటి వారి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డు రద్దు అవుతుంది.
ప్రత్యేక సమాచారం ఇన్నర్లైన్ పర్మిట్ (ILP)
- ఈశాన్య రాష్ర్టాల్లో కొన్ని రాష్ర్టాల్లోకి ప్రవేశించడానికి లేదా సందర్శించడానికి అవసరమైన అధికారిక అనుమతి పత్రం.
- అరుణాచల్ప్రదేశ్, మిజోరం, నాగాలాండ్ (దిమాపూర్ నగరం తప్ప) రాష్ర్టాల్లోకి ఆ రాష్ర్టాలకు చెందని భారతీయ పౌరులు ప్రవేశించాలంటే ఆ రాష్ర్టాల అనుమతి తీసుకోవాలి.
- ఈ విధమైన పరిరక్షణ 1873లో బ్రిటిష్ కాలంలోనే బెంగాల్ ఈస్ట్రన్ ఫ్రాంటియర్ రెగ్యులేషన్ ద్వారా నిర్ణయించారు. దీన్ని స్వతంత్య్రానంతరం కూడా కొనసాగిస్తున్నారు.
- ఆయా రాష్ట్ర శాసనసభలు ఒక చట్టం ద్వారా నియమ నిబంధనలను రూపొందిస్తాయి. వీటికి రాష్ట్రపతి ఆమోదం కూడా ఉండాలి.
- మణిపూర్ రాష్ట్రం కూడా ఇలాంటి చట్టాన్ని రూపొందించింది. ఆ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం కూడా లభించింది.
పైన పేర్కొన్న రాష్ర్టాలకు సవరించిన పౌరసత్వ చట్టం ద్వారా పౌరసత్వాన్ని పొందినవారు ప్రవేశించడానికి అర్హులు కారు.
సమాచార హక్కు చట్టం
- ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు, ప్రజలే పాలితులు. ప్రజల వాక్కే బ్రహ్మ వాక్కు అంటారు. ప్రజలకు అవసరమైన సమాచారం తెలియకపోతే ప్రభుత్వ అలసత్వాన్ని, అధికార దుర్వినియోగాన్ని ప్రశ్నించలేదు. ఆధునిక కాలంలో ‘ఇన్ఫర్మేషన్ ఈజ్ పవర్’ అనే నానుడి ఉంది. ప్రభుత్వ పాలనలో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని సాధించాలంటే ప్రజలు సమాచారాన్ని తెలుసుకునే హక్కును గుర్తించాలి.
- ‘నిజమైన స్వరాజ్యం అంటే కొంత మంది అధికారాన్ని చేజిక్కించుకోవడం కాదు. ఆ అధికారం దుర్వినియోగం అయినప్పుడు దాన్ని ప్రతిఘటించడమే’ అని గాంధీ అన్నారు.
- భారత రాజ్యాంగంలోని సమాచార హక్కు గురించి ప్రత్యక్షంగా పేర్కొనలేదు. అయితే ప్రాథమిక హక్కుల్లోని ప్రకరణ 19(1a) లో సమాచార హక్కు అంతర్గతంగా ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పుల్లో వెల్లడైంది.
- 1975-76లో రాజ్నారాయణ్ v/s ఇందిరాగాంధీ కేసులో సుప్రీంకోర్టు భారతదేశం ప్రజాస్వామిక దేశం కాబట్టి ప్రజలే అంతిమ సార్వభౌములని వారికి సేవలందించే ప్రభుత్వాలు పని తీరుకు సంబంధించిన సమాచారం తప్పనిసరిగా అందించాలని, ప్రాథమిక హక్కుల్లో అది అంతర్గతంగా ఉంటుందని పేర్కొంది.
- ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ నిర్ణయాలు, ఆ నిర్ణయాలకు ప్రాతిపదిక అయిన సమాచారం మొదలగు అన్ని విషయాలు ప్రజలకు తెలియాలి, తెలియజేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే.
- సమాచార హక్కును అనుసరించి ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి అన్ని విషయాలను ప్రజలు తెలుసుకునే
అవకాశముండాలి. - ప్రభుత్వానికి సంబంధించిన వివిధ ఫైళ్లు, డాక్యుమెంట్లు, రిపోర్టులు, నిర్ణయాలు, ప్రభుత్వ పనితీరు మొదలగు అంశాలకు సంబంధించిన అన్ని విషయాల్లో ప్రభుత్వం పారదర్శకతతో ప్రజలకు అందుబాటులో ఉంచాలి.
- ప్రజలు కోరిన సమాచారాన్ని నిర్ణీత సమయాల్లో సం బంధిత అధికారులు తెలియజేయాల్సి ఉంటుంది.
- పాలనలో పారదర్శకత లేకపోతే అవినీతికి, ఆశ్రిత పక్షపాతానికి అవకాశముంటుంది.
ప్రపంచ దేశాలు-సమాచార హక్కు - ప్రపంచంలో మొదటిసారి స్కాండినేవియన్ దేశాల్లో ఈ పద్ధతి అమల్లోకి వచ్చింది. 1776లో స్వీడన్ తన రాజ్యాంగంలో మొదటిసారి సమాచార హక్కును పొందుపరిచింది. ఆ తర్వాత 1951లో ఫిన్ల్యాండ్, 1970లో నార్వే, డెన్మార్క్, 1966లో అమెరికా సమాచార హక్కును చట్టబద్ధం చేశాయి.
భారతదేశంలో సమాచార హక్కు - సమాచార హక్కును గుర్తించేందుకు పౌర సమాజంలో కొంత మంది ప్రముఖులు గణనీయమైన కృషి చేశారు. రామన్ మెగసెసె అవార్డు గ్రహీతలైన అరుణారాయ్, సందీప్ పాండే, అరవింద్ కేజ్రీవాల్, లోక్సత్తా పార్టీ వ్యవస్థాపకుడైన డా.జయప్రకాశ్ నారాయణ్ వంటివారు ఉన్నారు.
సమాచార హక్కు చట్టం-2005 - 2005లో పార్లమెంటు సమాచార హక్కు చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం 2005, అక్టోబర్ 12వ తేదీ నుంచి
అమల్లోకి వచ్చింది. - ఈ చట్టంలో ఆరు అధ్యాయాలు, 31 సెక్షన్లు ఉన్నాయి.
ఉద్దేశం: ఈ చట్టం ప్రధాన ఉద్దేశం పాలనలో పారదర్శకతను సాధించడం.
గమనిక: 1997లోనే తమిళనాడు ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని రూపొందించింది. కాబట్టి దేశంలో సమాచార హక్కు చట్ట రూపకల్పనలో మొదటి రాష్ట్రంగా గుర్తిస్తారు. ఆ తర్వాత ఇదే సంవత్సరంలో గోవా రాష్ట్రంలో కూడా సమాచార హక్కు చట్టం రూపొందించింది.
సమాచారం అర్థ వివరణ - సమాచార హక్కు చట్టం ప్రకారం ప్రభుత్వ అధికార వ్యవస్థ నుంచి 17 రకాలైన సమాచారాన్ని పౌరులు పొందవచ్చు.
- ప్రభుత్వ రికార్డులను తనిఖీ చేయడం, వాటిని కాపీ చేసుకోవడం లేదా వాటి నుంచి నోట్సు రాసుకోవడం మొదలగు అంశాలు ఉంటాయి.
- ప్రతి శాఖలోను ప్రభుత్వం చేత నిర్దేశించిన పౌర సమాచార అధికారి నుంచి సమాచారం పొందవచ్చు.
చట్టంలోని ముఖ్యాంశాలు - ఈ చట్టం ప్రకారం ప్రతి శాఖలో ఒక పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారిని నియమిస్తారు. ప్రజలు కోరిన సమాచారాన్ని నిర్ణీత గడువులో అందించే బాధ్యత ఈ అధికారికే ఉంటుంది.
- ఒకవేళ సమాచార అధికారికి కాకుండా సహాయ సమాచార అధికారికి దరఖాస్తు ఇచ్చి ఉంటే ఆ అధికారి 35 రోజుల్లోగా సమాచారం ఇవ్వాలి.
- మూడో వ్యక్తి ప్రయోజనాలు ఇమిడి ఉన్నైట్లెతే సమాచారాన్ని 40 రోజుల్లోగా ఇవ్వాలి.
- నిర్ణీత సమయంలో జవాబు లేదా ప్రతిస్పందన లేదా సమాచారాన్ని ఇవ్వడానికి తిరస్కరించినైట్లెతే దరఖాస్తు చేసుకున్న తర్వాత 30 రోజుల్లోపు స్పందన లేకపోతే పై అధికారికి నేరుగా అప్పీలు
చేసుకోవచ్చు. - ఆ తర్వాత ఆ అధికారి కూడా సమాచారం ఇవ్వకపోతే 90 రోజుల్లోపు రాష్ట్ర సమాచార కమిషన్ లేదా కేంద్ర సమాచార కమిషన్ ఎదుట రెండో అప్పీలు చేసుకోవచ్చు.
- సాధారణ సామాచారం అయితే 30 రోజుల్లోపు, జీవించే హక్కు, వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన సమాచారమైతే 48 గంటల్లో ఇవ్వాలి. ఇందుకు నామమాత్ర రుసుం వసూలు చేస్తారు.
సమాచారం కోరే విధానం - ఈ చట్టం ప్రకారం ప్రత్యేకంగా ఏ వ్యక్తీ కోరకపోయినా, ప్రతి సంస్థ స్వచ్ఛందంగానే కొంత మౌలిక సమాచారాన్ని
ప్రచురించాలి. - ఆంగ్లంలో కానీ, హిందీలో కాని, రాజ్యాంగం గుర్తించిన వివిధ భాషల్లో కానీ సమాచారాన్ని కోరవచ్చుకోరవచ్చు.
శిక్షలు - నిబంధనల ప్రకారం ప్రజలకు సమాచారాన్ని అందించడంలో అధికారులు విఫలమైతే వారిపై వచ్చే ఫిర్యాదులను సమాచార కమిషన్లు విచారిస్తాయి. చట్టం నిర్దేశించిన మేరకు సమాచారం అందించని అధికారులకు నిర్ణీత గడువు ముగిసిన తర్వాత రోజుకు రూ.250 నుంచి గరిష్ఠంగా రూ.25 వేల వరకు జరిమానాతో పాటు కారాగార శిక్ష కూడా విధించవచ్చు.
జీబీకే పబ్లికేషన్స్
హైదరాబాద్, 9959361278
Previous article
JNAFAU PG Admissions | కళల కాణాచి జేఎన్ఏఎఫ్ఏయూ
RELATED ARTICLES
-
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
-
Betriviera : dépôts, paiements et gestion de la caisse
-
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
-
Corgibet : méthodes, limites et règles de retrait
-
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
-
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు

