Indian History – Groups Special | మలి వేద కాలం నాటి రాజకీయ వ్యవస్థ
- మలి వేద కాలంలో రాజు అధికారం పెరిగింది. అంతకుముందు రాజును కంట్రోల్ చేసే సభ, సమితిల ప్రాధాన్యం తగ్గిపోయింది.
- సభ, సమితిల్లో రాజబంధువులు, బ్రాహ్మణులు, ధనికులు వాటిపై పెత్తనం చెలాయించేవారు. విధాత అనే సభ పూర్తిగా అదృశ్యమయ్యింది.
- సభల్లో స్త్రీలు పాల్గొనడం నిషేధించడమైంది. రుగ్వేదంలో తెగలోని సభ్యులందరూ (ఆడ, మగ) సభలో సభ్యులుగా ఉండేవారు.
- రాజులు తెగలపై పెత్తనం చేసి, ప్రాంతాల మీద అధికారం చెలాయించే స్థితికి ఎదిగారు.
- ప్రాంతీయ రాజ్యాల ఏర్పాటుతో ప్రజలు తమ విధేయతను తెగ కంటే ప్రాంతానికే చూపేవారు.
- మలి వేద కాలం నాటికి ఒక ప్రాంతంలో నివాసం ఏర్పర్చుకొన్న తెగ పేరు మీదుగా ఆ ప్రాంతానికి పేరు వచ్చింది. ఉదాహరణకు ‘పాంచాల’ అనే తెగ పేరు మీదుగా ఆ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది.
- మొదటి సారిగా ప్రాంతాన్ని సూచిస్తూ రాష్ట్రం అనే పదం ఈ కాలంలో ఉపయోగించారు. రాజరికం వంశపారంపర్యమైంది.
- తన పలుకుబడిని పెంచుకొనేందుకు రాజు మూడు రకాలైన యాగాలు చేసేవాడు.
- 1) రాజసూయ యాగం- దీనివల్ల తమకు అత్యున్నతమైన శక్తి వస్తుందని నమ్మేవారు.
- 2) అశ్వమేధ యాగం- రాజు తన గుర్రం ఆటంకం లేకుండా తిరిగినంత మేర తన రాజ్యంగా భావించారు.
- 3) వాజపేయ యాగం- ఇందులో జరిగే పందెంలో రాజు రథం అతడి బంధువుల రథాన్ని జయించాలి.
- పూజారి, సేనాని, పట్టపురాణి, ఇత్యాదుల విధులను నిర్వహించే 12 మంది రత్నిన్ అనే అధికారులు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ రత్నిన్లలో సంగ్రహత్రి ముఖ్యుడు. ఈ కాలం నాటికి పన్నులు వసూలు చేయడం అమల్లోకి వచ్చింది. ఈ కాలం నాటికి కూడా రాజుకు స్థిరమైన సైన్యం లేదు. తెగల సైన్యం మీదనే ఆధారపడి ఉండేవాడు.
మత పరిస్థితులు
- రుగ్వేద కాలం నాటి ప్రధాన దేవతలైన ఇంద్రుడు, అగ్ని మలివేద కాలంలో ప్రాధాన్యం కోల్పోయారు. మలివేద కాలం లో సృష్టికర్త అయిన ప్రజాపతికి అత్యంత ముఖ్య స్థానం ఇచ్చారు.
- పశువుల దేవత అయిన రుద్రుడికి ప్రాధాన్యం పెరిగింది.
- దైవత్వానికి చిహ్నంగా కొన్ని వస్తువులను పూజించడం ప్రారంభమైంది.
- విగ్రహారాధన లక్షణాలు కూడా ఈ కాలంలో మొదలయ్యాయి.
- సమాజం 4 వర్గాలుగా చీలిపోయిన తర్వాత వర్గాలకు సొంత దేవతలు ఏర్పడ్డారు. శూద్రులకు పశుపాలకుడైన పుషన్ దేవుడయ్యాడు.
- రుగ్వేద కాలంలో లేని కర్మకాండలు యజ్ఞాలు చేసేటప్పుడు జంతువులను బలి ఇవ్వడం ప్రారంభమైంది. అందుకే ఈ కాలంలో ఇంటికి వచ్చే అతిథిని ‘గోఘ్న’ అని పిలిచారు. అంటే గో మాంసం ఆరగించేవాడు అని అర్థం.
- యజ్ఞాలు చేసే వ్యక్తిని యజమానుడు అనేవారు. యజ్ఞం ఫలితం బాగా రావాలంటే మంత్రాలను తప్పులేకుండా ఉచ్ఛరించాలని నమ్మేవారు.
- ఈ సూత్రాలు, కర్మకాండలు యజ్ఞాలు అనే వాటిని బ్రాహ్మణులు అనే పురోహితులు సృష్టించి వాటి మీద తమ గుత్తాధిపత్యం ప్రకటించుకున్నారు. అంటే మిగతా వారు వీటిని నిర్వహించకూడదు.
- రాజసూయ యాగం చేసినప్పుడు ప్రధాన పురోహితుడికి 2 లక్షల 40 వేల గోవులను దక్షిణగా ఇచ్చినట్లు తెలుస్తుంది.
- గోవులతో పాటు బంగారాన్ని, గుర్రాలను, బట్టలను దక్షిణగా ఇచ్చేవారు. భూమిని దక్షిణగా ఇవ్వలేదు. క్రీ.పూ. 600 ప్రాంతంలో అంటే వేద యుగం చివరి దశలో పురోహితుల ఆధిపత్యానికి, యజ్ఞయాగాదులకు పాంచాల, విధేహ రాజ్యాల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఈ ప్రాంతాల్లో ఉపనిత్తులు రచించారు. ఉపనిషత్తులు అనేవి సరైన విశ్వాసం, సరైన విజ్ఞానం, ఆత్మ జ్ఞానం ఉండాలని తెలిపాయి.
- ఉపనిషత్తులను వేదయుగం చివర రాశారు. కాబట్టి ఈ ఉపనిషత్తులను వేదాంతాలు అని కూడా అంటారు.
- మలివేద కాలం నాటికి పశుపాలన మీద ఆధాపడిన రుగ్వేద సమాజం వ్యవసాయక సమాజంగా పరిణామం చెందింది. ఈ పరిణామానికి ముఖ్య కారణం ఇనుము కనుక్కోవడం. ఇనుము ద్వారా అడవులను నరికి సాగు భూములుగా మార్చుకొని వ్యవసాయ ఉత్పత్తులను పెంచారు. పెద్ద స్థాయిలో రాజ్యవ్యవస్థను ఏర్పాటు చేయలేకపోయారు. ఇందుకు కారణం సైన్యాన్ని, ఉద్యోగులను పోషించడానికి పెద్ద స్థాయిలో వారికి పన్నులు రాకపోవడమే.
ముఖ్య విషయాలు
- మలివేద కాలంలో విద్య గురుకులాల్లో జరిగేది. గురువులు వేద, ఇతిహాస, పురాణ, వ్యాకరణ, గణిత, ఖగోళ, నీతి శాస్ర్తాల్లో బోధన జరిగేది.
- విద్యార్జన అనంతరం సమావర్తనం (డిగ్రీ పట్టా) అనే ఉత్సవంలో విద్యార్థి స్నానం చేసి విద్యను పూర్తి చేసుకునేవాడు.
- మలివేద కాలంలో గార్గి, లోపాముద్ర, మైత్రేయి, మమత వంటి వారు విద్యనభ్యసించి సాహిత్యంలో పాలుపంచుకున్నారు.
- మలివేద కాలం నాటి రాజు ఏక్రాట్, సామ్రాట్, చక్రవర్తి వంటి బిరుదులు ధరించాడు. ఈ కాలంలో పణ, కర్షాపణ, పాద వంటి నాణాలు ఉపయోగించారు.
- వరి, గోధుమలతో పాటు బార్లీ, చిక్కుడు, నువ్వులను పండించేవారు.
- ఈ కాలంలో ప్రజాపతి, విష్ణువు వంటి దేవతలు ప్రాధాన్యాన్ని పొందారు.
- మత అంశాల్లో కర్మ సిద్ధాంతం, ఆత్మ పునర్జన్మ సిద్ధాంతం ముందుకు వచ్చాయి.
- ఉపనిషత్తులు, యజ్ఞాలు, జంతు బలులను వ్యతిరేకించి జ్ఞానానికి ప్రాధాన్యం ఇచ్చాయి. మహాభారతాన్ని పంచమవేదం అని అంటారు.
- ఉపనిషత్తుల తర్వాత హిందువుల సిద్ధాంతాలు, నమ్మకాలకు మూలాధారం భగవద్గీత.
- ఉపనిషత్తులు 108 ఉన్నాయి. ఇందులో చాందోగ్య ఉపనిషత్తు, బృహదారణ్యక ఉపనిషత్తులను అన్నింటికంటే ముందే రచించారు.
- ఉపనిషత్తుల ముఖ్య సందేశం తత్వం అసి.
- ఉపనిషత్తుల కాలంలో జనక మహారాజు కొలువులో యాజ్ఞవల్క్యుడు అనే ఆచార్యుడు ఉన్నాడు. అతనికి మైత్రేయి, కాత్యాయిని అనే ఇద్దరు భార్యలు ఉన్నారు.
- వశిష్ట, అగస్థ్య, దీర్ఘతమసు, కణ్హుడు, అంగీరసుడు వంటి ఆచార్యులు అనార్యులు. వీరు శూద్రులైనప్పటికీ తమ వేద జ్ఞానంతో బ్రాహ్మణులుగా గుర్తింపు పొందారు.
- గ్రామాధిపతిని గ్రామీన్ అని అన్నారు.
- ఐతరేయ బ్రాహ్మణంలోని బ్రాహ్మణాలు ఇతరుల నుంచి దానాలు పొందవచ్చని, వైశ్యులు పన్నులు చెల్లించాలని, శూద్రులు ఉన్నత వర్గాలకు సేవ చేయాలని తెలిపింది.
- మలివేద కాలంలో పన్నుల అధికారిని భాగదూష అని పిలిచేవారు.
- ట్రెజరర్ను సంగ్రహత్రి అనేవారు.
- క్షాత్రి అంటే రాజుకు గొడుగు పట్టేవాడు. సూత అంటే రాజు రథాన్ని నడిపేవాడు. సేనాని అంటే సైన్యాధ్యక్షుడు. సైన్యాన్ని నడిపేవాడు.
- శతపతి అంటే వంద గ్రామాలపై అధిపతి. స్థపతి అంటే రాజ్యానికి దూరంగా ఉండే ప్రాంతాలకు గవర్నర్.
- అధ్యక్షాస్, సభాసద్స్, గ్రామ్యావధిన్స్ అంటే న్యాయాధికారులు. ప్రజాపతి ముఖ్యదేవుడు.
- విష్ణు- రక్షకుడు, ఉషాన్- శూద్రుల దేవుడు.
- శతపథ బ్రాహ్మణం ప్రకారం విధేహ, మాతలి సరస్వతి నది నుంచి అగ్నిని విధేహ వరకు తీసుకుపోయాడు (అంటే పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని ఆర్య సంస్కృతిని బీహార్లోని విధేహ వరకు విస్తరింపజేసినవాడు).
- ఆర్యులు తమ సంస్కృతిని పాటించని వారిని వ్రత్యులు, కిరాతులు అని పిలిచారు. (వీరు ప్రధానంగా మగధ ప్రాంతంలో ఉన్నారు).
- ఉపనిషత్తులు రాసిన యాజ్ఞవల్క్యుడు విధేహ రాజైన జనకుడి వద్ద ఉన్నాడు.
- కాశీని పరిపాలించిన అజాత శత్రువు మరొక తత్వ ఆలోచన కలిగిన చక్రవర్తి.
- మలివేద కాలంలో వస్తు మార్పిడికి నిష్క, శతమాన అనే బంగారు నాణాలు వాడారు.
- వైశ్యులను బలికృత్ లేక బలిహృత్ అని అన్నారు. అందుకు కారణం ఆర్యుల కాలంలో బలి అనే పన్ను చెల్లించేది వైశ్యులు మాత్రమే.
- ఆర్యుల కాలంలో బ్రాహ్మణులు, శూద్రులకు పన్ను విధించలేదు. క్షత్రియులకు పన్ను మినహాయింపు ఇచ్చారు.
- చేతివృత్తుల్లో రథకార (రథాలు తయారు చేసేవాడు), తక్షన్ (కార్పెంటర్) అనే ఇద్దరు సాంఘికంగా తక్కువ వర్గానికి చెందిన వారి అవసరాలు రాజుకు ఉన్నాయి. కాబట్టి వారికి ప్రాధాన్యం ఇచ్చారు.
- అధర్వణ వేదంలో విశమత అనే రాజు ఉండేవాడని, అతను రైతు కూలీలను పీడించుకు తిన్నాడని తెలిపారు.
- రుగ్వేద కాలంలో అగ్నిని పూజించినట్లు ఉన్న అగ్ని పొయ్యిల ఆధారాలు అత్రాంజిఖేరలో బయల్పడ్డాయి.
- రుగ్వేద కాలంలో అతిథిని గోఘ్న అని పిలిచేవారు. గోఘ్న అంటే గోవు మాంసం తినేవాడు. మరికొన్నిచోట్ల అగన్య అని తెలిపారు. అగన్య అంటే తినకూడనిది. అంటే పాలిచ్చే గోవులను తినకూడదని అర్థం.
వేద కాలంలో 8 రకాల వివాహాలు ఉన్నాయి.
1) బ్రహ్మ వివాహం- తన వర్గానికి చెందిన అమ్మాయినే అగ్ని చుట్టూ తిరిగి పెండ్లి చేసుకోవడం
2) ప్రజాపత్య వివాహం- కట్నం లేకుండా పెండ్లి చేసుకోవడం
3) దైవ వివాహం- బ్రాహ్మణులకు ఫీజు ఇచ్చుకోలేక ఒక అమ్మాయిని కానుకగా ఇచ్చి పెండ్లి చేయడం
4) అర్స వివాహం- అమ్మాయి తండ్రి, అబ్బాయి నుంచి ఒక ఆవు, ఒక ఎద్దును తీసుకొని వివాహం చేయడం
5) రాక్షస వివాహం- బలవంతంగా ఎత్తుకుని పోయి వివాహం చేసుకోవడం
6) పైశాచ వివాహం- అమ్మాయి నిద్రపోతుంటే బలవంతంగా ఎత్తుకొనిపోయి పెండ్లి చేసుకోవడం
7) గాంధర్వ వివాహం- ప్రేమ వివాహం
8) అసుర వివాహం- డబ్బిచ్చి అమ్మాయిని కొనుక్కొని పెండ్లి చేసుకోవడం
మాదిరి ప్రశ్నలు
1. రుగ్వేదంలో పేర్కొన్న ‘కింగ్ ఆఫ్ గాడ్స్’ ఎవరు?
1) ఇంద్రుడు 2) సోమదేవుడు
3) అగ్ని 4) వరణుడు
2. కింది వాటిని జతపర్చండి.
1. భాగదూష ఎ. ఖజానాదారుడు
2. లంగాల బి. నాగలి
3. సంగ్రహత్రి సి. పన్నులు వసూలుచేసే అధికారి
4. పరసు డి. గొడ్డలి
1) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
3) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
4) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
3. ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ది ఆర్యన్స్ అనే గ్రంథాన్ని రాసింది?
1) మాక్స్ముల్లర్
2) దయానంద సరస్వతి
3) బాలగంగాధర తిలక్
4) గార్టన్ చైల్డ్
4. భారతీయ సంగీతానికి మూలాధారాలు ఏ వేదంలో కనిపిస్తాయి?
1) రుగ్వేదం 2) సామవేదం
3) యజుర్వేదం 4) అధర్వణ వేదం
5. వ్యవసాయ పండుగల గురించి తెలిపేది?
1) శతపథ బ్రాహ్మణం
2) ఐతరేయ బ్రాహ్మణం
3) బృహదారణ్యక ఉపనిషత్తు
4) చాందోగ్య ఉపనిషత్తు
6. కింది వాటిలో సరైనది?
1) మలివేద కాలంలో నిష్క, శతమాన అనే నాణాలు వినియోగించారు
2) ఇవి బంగారు నాణాలు
3) 1 4) 1, 2
7. అధ్యక్షాస్, సభాసద్స్, గ్రామ్యావధిన్స్ అంటే?
1) గ్రామాల అధికారులు
2) న్యాయాధికారులు
3) గ్రామ రక్షకులు
4) పన్ను వసూలు చేసే అధికారులు
8. కింది వాటిని జతపర్చండి (వేదం, దాన్ని చదివే పురోహితుడి పేరు).
1. రుగ్వేదం ఎ. హోత్రి
2. యజుర్వేదం బి. అధవరయు
3. సామవేదం సి. ఉదగాత్రి
4. అధర్వణ వేదం డి. బ్రాహ్మణ
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
4) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
సమాధానాలు
1-2, 2-1, 3-3, 4-2,
5-1, 6-4, 7-2, 8-1.
సాసాల మల్లికార్జున్
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ,
కోరుట్ల
Previous article
Southern Railway Recruitment | దక్షిణ రైల్వేలో 790 పోస్టులు
RELATED ARTICLES
-
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
-
Betriviera : dépôts, paiements et gestion de la caisse
-
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
-
Corgibet : méthodes, limites et règles de retrait
-
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
-
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు

