కరెంట్ అఫైర్స్
తెలంగాణ
-
వైద్య సీట్లు

తెలంగాణ 2,477 పీజీ స్పెషాలిటీ సీట్లతో ఏడో స్థానంలో, 175 సూపర్ స్పెషాలిటీ సీట్లతో పదో స్థానంలో నిలిచింది. పీజీ స్పెషాలిటీ సీట్లలో తొలి ఐదు స్థానాల్లో కర్ణాటక (5,523), మహారాష్ట్ర (5,297), తమిళనాడు (4,159), ఉత్తరప్రదేశ్ (3,509), ఆంధ్రప్రదేశ్ (2,650) రాష్ర్టాలు ఉన్నాయి. సూపర్ స్పెషాలిటీ సీట్ల జాబితాలో తొలి ఐదు స్థానాల్లో వరుసగా ఢిల్లీ (703), తమిళనాడు (671), ఉత్తరాఖండ్ (581), కర్ణాటక (461), మహారాష్ట్ర (380) ఉన్నాయి.
దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో కలిపి అత్యధిక మెడికల్ కాలేజీలున్న రాష్ర్టాల జాబితాలో తమిళనాడు (71) మొదటి స్థానంలో ఉండగా.. తర్వాత వరుసగా కర్ణాటక (67), ఉత్తరప్రదేశ్ (67), మహారాష్ట్ర (63), తెలంగాణ (41), గుజరాత్ (36) రాష్ర్టాలు ఉన్నాయి.
శ్రీనివాస్
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ తెలంగాణ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం)గా చాగంటి శ్రీనివాస్ డిసెంబర్ 26న బాధ్యతలు చేపట్టారు. ఈయన 1987 ఐటీఎస్ బ్యాచ్ అధికారి. టెలీకమ్యూనికేషన్స్ రంగంలో వివిధ హోదాల్లో పనిచేశారు. ఇదివరకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్ అధికారిగానూ బాధ్యతలు నిర్వర్తించారు.
విజయసారథి
సంస్కృత పండితులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీభాష్యం విజయసారథి డిసెంబర్ 28న మరణించారు. కరీంనగర్ జిల్లాలోని చేగుర్తిలో 1936, మార్చి 10న జన్మించారు. శారదా పదకింకిణి, శబరీ పరివేదనం, మనోహరం వంటి రచనలతో బాల కవిగా గుర్తింపు పొందారు. ఆయనకు 2020, జనవరి 25న పద్మశ్రీ ప్రకటించగా 2021, నవంబర్ 8న అందుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విశిష్ట సాహిత్య పురస్కారం అందజేసింది. తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం అందించే మహామహోపాధ్యాయ పురస్కారం, బిర్లా ఫౌండేషన్ వాచస్పతి పురస్కారం, తెలుగు యూనివర్సిటీ ప్రతిభా పురస్కారాలు లభించాయి. సంస్కృత భాషావేత్తగా దక్షిణ భారతదేశంలో పద్మశ్రీ పొందిన మొదటి వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు. సీఎం కేసీఆర్ ఉద్యమం, సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ ‘చంద్రశేఖర ప్రశస్తిః’ పేరుతో సంస్కృత గ్రంథం రాశారు.
రాజేశ్వరి
కాళ్లతోనే కవితలు రాసిన రాజన్న సిరిసిల్లకు చెందిన బూర రాజేశ్వరి డిసెంబర్ 28న మరణించారు. పుట్టుకతోనే దివ్యాంగురాలైన ఆమెకు మాటలు కూడా సరిగా రావు. సుద్దాల అశోక్తేజ ప్రభావంతో ఆమె కాళ్లతోనే సుమారు 500కు పైగా కవితలు రాశారు. అశోక్తేజ ఆమెకు సిరిసిల్ల రాజేశ్వరి అని పేరు పెట్టారు. ఆమె కవితలతో ఒక పుస్తకాన్ని అచ్చువేయించారు. ఆయన చొరవతో మహారాష్ట్ర ప్రభుత్వం రాజేశ్వరి జీవితచరిత్రను తెలుగు పాఠ్యపుస్తకంలో ఓ పాఠ్యాంశంగా చేర్చింది.
మారుత్ డ్రోన్కు డీజీసీఏ
హైదరాబాద్ స్టార్టప్ ‘మారుత్’ రూపొందించిన వ్యవసాయ డ్రోన్ ‘ఏజీ-365 అగ్రికాప్టర్’కు డీజీసీఏ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) నుంచి డిసెంబర్ 28న టైప్ సర్టిఫికేషన్ లభించింది. ఇది దేశంలోనే తొలిసారి వ్యవసాయ పనుల కోసం రూపొందించిన మల్టీ యుటిలిటీ (బహుళ ప్రయోజనకర) డ్రోన్ అని మారుత్ స్టార్టప్ వ్యవస్థాపకుడు ప్రేమ్కుమార్ వెల్లడించారు.
జాతీయం
త్రైపాక్షిక ఒప్పందం
నాగా తిరుగుబాటు సంస్థ జెలియాంగ్రోంగ్ యునైటెడ్ ఫ్రంట్ (జడ్యూఎఫ్)తో భారత, మణిపూర్ ప్రభుత్వాలు డిసెంబర్ 27న శాంతి ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా హింసను వీడి, ప్రజాస్వామ్య పద్ధతులను అవలంబించాలి. జడ్యూఎఫ్ నాయకులకు పునరావాసం, భద్రత కల్పించడానికి సంయుక్త పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేస్తారు. అస్సాం, నాగాలాండ్, మణిపూర్లలో ఉన్న నాగా తెగల ప్రజల పరిరక్షణ కోసం జడ్యూఎఫ్ను 2011లో ఏర్పాటు చేశారు. నాగా తెగ ప్రజలు ఉన్న ఈశాన్య రాష్ర్టాల్లోని ప్రాంతాలను కలిపి ‘జెలియాంగ్రోంగ్’ అనే రాష్ట్రం ఏర్పాటే లక్ష్యంగా ఇది పనిచేస్తుంది.
అమృత్ భారత్ స్టేషన్
రైల్వే స్టేషన్ల ఆధునీకరణ కోసం ‘అమృత్ భారత్ స్టేషన్’ అనే కొత్త విధానాన్ని రూపొందించినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ డిసెంబర్ 27న ప్రకటన విడుదల చేసింది. దీనిలో భాగంగా స్టేషన్లలో కనీస సౌకర్యాలు మెరుగుపర్చి, రూఫ్ ప్లాజాలు, సిటీ సెంటర్లు ఏర్పాటు చేస్తారు. హై లెవల్ ప్లాట్ఫామ్లను నిర్మించి, 5జీ ఇంటర్నెట్ సేవలను అందిస్తారు.
బ్రహ్మోస్
సుఖోయ్-30 యుద్ధ విమానం నుంచి బ్రహ్మోస్ ఎక్స్టెండెడ్ రేంజ్ క్షిపణిని డిసెంబర్ 29న బంగాళాఖాతంలో విజయవంతం పరీక్షించారు. ఈ ప్రయోగంలో బ్రహ్మోస్ 400 కి.మీ. దూరంలో ఉన్న లక్ష్యాన్ని పేల్చేసింది. 2022, మేలో సూపర్సోనిక్ మిసైల్ ఎక్స్టెండెడ్ వెర్షన్ను సుఖోయ్ నుంచి విజయవంతంగా పరీక్షించారు. ఇప్పుడు క్షిపణి పరిధిని 290 కి.మీ. స్థాయి నుంచి 400 కి.మీ.కు పెంచారు.
అంతర్జాతీయం
మంగ్దెచ్చు పవర్ ప్లాంట్

భారత సహకారంతో భూటాన్లో నిర్మించిన మంగ్దెచ్చు హైడ్రోఎలక్ట్రిక్ పవర్ (జలవిద్యుత్) ప్రాజెక్ట్ను ఆ దేశానికి చెందిన డ్రక్ గ్రీన్ పవర్ కొర్పొరేషన్ (డీజీపీసీ)కు డిసెంబర్ 27న అప్పగించారు. 720 మెగావాట్ల సామర్థ్యంతో భారత్ ఆర్థిక, సాంకేతిక సహాయంతో నిర్మించారు. ఈ ప్రాజెక్టుకు ‘బ్రూనెల్ మెడల్-2020’ను లండన్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సివిల్ ఇంజినీర్స్ అందించింది. భారత్-భూటాన్లు జలవిద్యుత్కు సంబంధించి జల్ధాకా ఒప్పందంపై 1961లో సంతకాలు చేశాయి. జల్ధాకా ప్రాజెక్టు పశ్చిమబెంగాల్లో ఉంది. ఈ ప్రాజెక్టులో ఉత్పత్తి అయిన విద్యుత్ను దక్షిణ భూటాన్కు సరఫరా చేస్తున్నారు. భూటాన్ మొదటి 336 మెగావాట్ల చుఖా హైడ్రోపవర్ ప్రాజెక్ట్ (సీహెచ్పీ)ను పూర్తిగా భారత నిధులతో నిర్మించారు.
మొదటి మెట్రో రైలు
బంగ్లాదేశ్లో మొదటి మెట్రో రైలును రాజధాని ఢాకాలో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా డిసెంబర్ 28న ప్రారంభించారు. జపాన్ నిధులతో లైన్ 6 పేరుతో ఈ మెట్రో వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా మొదటి దశ 20 కి.మీ. (16 స్టేషన్లు) నిర్మించారు. మొదటి రైలు దియాబారీ, అగర్గావ్ స్టేషన్ల మధ్య ప్రయాణం మొదలుపెట్టింది. 2030 నాటికి 129 కి.మీ. ఈ మెట్రో ప్రాజెక్ట్ పూర్తికానున్నది. దీనిలో 61 కి.మీ. భూగర్భంలో ఉంటుంది.
భారత్-ఆస్ట్రేలియా వాణిజ్యం
భారత్-ఆస్ట్రేలియా మధ్య కుదిరిన మధ్యంతర స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) డిసెంబర్ 29 నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో ఆస్ట్రేలియా మార్కెట్లో భారత ఎగుమతులు జౌళి, తోళ్లు వంటి వేలాది ఉత్పత్తులు పన్నురహితంగా లభించనున్నాయి. ఫలితంగా వచ్చే ఐదేళ్లలో ద్వైపాక్షిక బిజినెస్ రెట్టింపై 45-50 బిలియన్ డాలర్లకు చేరొచ్చని ఎగుమతిదార్లు, పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2022, ఏప్రిల్ 2న ది ఎకనామిక్ కో ఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ (ఈసీటీఏ)పై ఇరుదేశాలు సంతకాలు చేశాయి.
వార్తల్లో వ్యక్తులు
మైకీ హోథీ

సంతోష్ కుమార్ యాదవ్
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) చైర్మన్గా సంతోష్ కుమార్ యాదవ్ డిసెంబర్ 26న నియమితులయ్యారు. ఈయన 1995 బ్యాచ్ ఉత్తరప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి.
సుభాశిష్ పాండా
ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (డీడీఏ) వైస్ చైర్మన్గా సుభాశిష్ పాండా డిసెంబర్ 26న నియమితులయ్యారు. ఈయన 1997 బ్యాచ్ హిమాచల్ ప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి.
కమల వర్ధన్ రావు
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ), ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సీఈవోగా గంజి కమల వర్ధన్ రావు డిసెంబర్ 26న నియమితులయ్యారు. ఈమె 1990 బ్యాచ్ కేరళ కేడర్ ఐఏఎస్ అధికారి.
ప్రచండ
నేపాల్ ప్రధానిగా పుష్పకమల్ దహల్ ప్రచండ డిసెంబర్ 26న ప్రమాణం చేశారు. సీపీఎన్-మావోయిస్టు సెంటర్ (ఎంసీ) పార్టీ చైర్మన్ అయిన ఈయన ప్రధాని పదవి చేపట్టడం ఇది మూడోసారి. 275 స్థానాలు ఉన్న నేపాల్ ప్రతినిధుల సభకు జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 138 సీట్లు ఏ పార్టీకి రాలేదు. నేపాలీ కాంగ్రెస్ పార్టీకి 89, సీపీఎన్-యూఎంఎల్ పార్టీ 78, సీపీఎన్-ఎంసీ-32 సీట్లు గెలుచుకున్నాయి. నేపాలీ కాంగ్రెస్, సీపీఎన్-ఎంసీ, మరో మూడు పార్టీలతో కూడిన కూటమి సర్కారును ఏర్పాటు చేసేందుకు అంగీకరించాయి. ప్రధాని పదవి రొటేషన్ పద్ధతిలో చేపట్టాలని ప్రచండ, ఇప్పటి వరకు ప్రధానిగా ఉన్న నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవ్బా మధ్య ఒప్పందం కుదిరింది.
గోపాల్
తమిళనాడు ప్రభుత్వ స్పెషల్ సీఎస్గా తెలుగు వ్యక్తి కూతాటి గోపాల్ను సీఎం స్టాలిన్ డిసెంబర్ 29న నియమించారు. ఈయన నల్లగొండ జిల్లాలోని శాలిగౌరారం మండల కేంద్రానికి చెందినవారు. ఈయన 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. తమిళనాడులోనే జాయింట్ కలెక్టర్గా, కలెక్టర్గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు.
క్రీడలు
నిఖత్ జరీన్

75 కిలోల విభాగంలో లవ్లీనా అరుంధతి చౌదరిపై విజయం సాధించింది. 48 కిలోల విభాగంలో మంజురాణి, 52 కిలోల విభాగంలో సాక్షి, 54 కిలోల విభాగంలో శిక్ష, 57 కిలోల విభాగంలో మనీశ, 60 కిలోల విభాగంలో పూనమ్, 63 కిలోల విభాగంలో శశి చోప్రా, 81+ కిలోల విభాగంలో నూపుర్, 81 కిలోల విభాగంలో సవీటి గెలిచారు.
పీలే
బ్రెజిల్ ఫుట్బాల్ దిగ్గజ క్రీడాకారుడు పీలే డిసెంబర్ 29న మరణించారు. 1940, అక్టోబర్ 23న జన్మించిన పీలే అసలు పేరు ఎడ్సన్ అరాంటెస్ డో నాసిమెంటో. 92 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడి 77 గోల్స్ చేశారు. 21 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో మూడు ఫిఫా ప్రపంచ కప్ (1958, 62, 70)లు సాధించిన ఏకైక ఆటగాడు. ప్రపంచ కప్ ఫైనల్లో గోల్ చేయడంతో పాటు ట్రోఫీ దక్కించుకున్న అతి పిన్న వయస్కుడు (1958లో 17 ఏండ్లు) పీలే.

అర్చన కే ఉపాధ్యాయురాలు,
విషయ నిపుణులు, నల్లగొండ
RELATED ARTICLES
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు






