Current Affairs | ఏ రాష్ట్రంలోని బిహు నృత్యం గిన్నిస్ రికార్డును సాధించింది?
1. ఏ అంశానికి సంబంధించి ఇటీవల ప్రపంచ వాణిజ్య సంస్థ భారత్కు వ్యతిరేకంగా ఆదేశాలు ఇచ్చింది? (2)
1) రైతులకు ఇస్తున్న రాయితీలు
2) ఐటీ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు
3) కూరగాయల ఎగుమతులపై పరిమితులు
4) పైవేవీ కాదు
వివరణ: ఐటీ ఉత్పత్తులపై భారత్ విధిస్తున్న దిగుమతి సుంకాలు వాణిజ్య నిబంధనలకు విరుద్ధమని జెనీవా కేంద్రంగా పనిచేసే ప్రపంచ వాణిజ్య సంస్థ ఇటీవల ఉత్తర్వులను జారీ చేసింది. జపాన్, తైవాన్, యూరోపియన్ యూనియన్ లు భారత్కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశాయి. మొబైల్ ఫోన్స్, మైక్రోఫోన్స్, ట్రాన్స్మిషన్కు సంబంధించిన వస్తువులు అందులో ఉన్నాయి. 1996లో వచ్చిన సమాచార సాంకేతిక ఒప్పందానికి ఇవి విరుద్ధంగా ఉన్నాయని ఫిర్యాదు. దీనిపై భారత్ సంతకం కూడా చేసింది. అయితే భారత్ కూడా తన వాదనను గట్టిగా వినిపిస్తుంది. ఒప్పందం అమల్లోకి వచ్చినప్పుడు స్మార్ట్ఫోన్లు లేనే లేవని, నిబంధనల పరిధిలోకి ఇవి రావని భారత్ అంటోంది. తీర్పు ఇప్పటికే భారత్కు వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో దీనిపై మరోసారి ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉంది.
2. పీటీపీ-ఎన్ఈఆర్ అనే పథకం ఇటీవల వార్తల్లో ఉంది. ఇది దేనికి సంబంధించింది? (1)
1) గిరిజన ఉత్పత్తుల అభివృద్ధికి
సంబంధించింది
2) గ్రామీణ పేదలకు విద్య అందివ్వడానికి
3) పాఠశాల విద్యార్థులకు ఎక్సర్సైజ్లు
4) మహిళలకు రుణాలు
వివరణ: గిరిజన మంత్రిత్వ శాఖ పీటీపీ-ఎన్ఈఆర్ అనే పథకాన్ని ప్రారంభించింది. దీని విస్తరణ రూపం- మార్కెటింగ్ అండ్ లాజిస్టిక్స్ డెవలప్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ట్రైబల్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ది నార్త్-ఈస్టర్న్ రీజియన్. ఈశాన్య రాష్ర్టాల్లో గిరిజనులకు సంబంధించిన ఉత్పత్తుల మార్కెటింగ్, లాజిస్టిక్స్ను అభివృద్ధి చేసేందుకు ఉద్దేశించింది. ఎనిమిది ఈశాన్య రాష్ర్టాలకు ఈ పథకం వర్తిస్తుంది. దీన్ని టీఆర్ఐఎఫ్ఈడీ అమలు చేస్తుంది. గిరిజనుల ఆదాయాన్ని పెంచడంతో పాటు వారికి జీవనోపాధి, నైపుణ్య అభివృద్ధిని కూడా పెంచేందుకు ఉద్దేశించింది ఇది.
3. ఆసియా రెజ్లింగ్ చాంపియన్ షిప్లో భారత్ ఎన్ని పతకాలను గెలుచుకుంది? (3)
1) 12 2) 13 3) 14 4) 15
వివరణ: 36వ ఆసియా రెజ్లింగ్ చాంపియన్షిప్లను కజకిస్థాన్లోని ఆస్తానాలో నిర్వహించారు. ఈ దేశం మధ్య ఆసియాలో ఉంది. ఏప్రిల్ 9 నుంచి 14 వరకు ఈ టోర్నీ నిర్వహించారు. దీన్ని న్యూఢిల్లీలో నిర్వహించాలని భావించారు. అనివార్య కారణాల వల్ల కజకిస్థాన్కు మార్చారు. మొత్తం 331 మంది రెజ్లర్లు, 22 దేశాల నుంచి ఇందులో పాల్గొన్నారు. ఇందులో 30 మంది భారతీయులు ఉన్నారు. భారత్ 14 పతకాలను సాధించింది, ఏడో స్థానంలో నిలిచింది. 35వ క్రీడలు మంగోలియాలోని ఉలాన్బాటర్లో గతేడాది ఏప్రిల్ 19 నుంచి 24 వరకు నిర్వహించారు.
4. కింది ఏ దేశం ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో వ్యవస్థాపక సభ్యత్వం పొందింది? (4)
1) శ్రీలంక 2) బంగ్లాదేశ్
3) చైనా 4) నేపాల్
వివరణ: ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్కు నేపాల్ వ్యవస్థాపక సభ్యత్వాన్ని పొందింది. ఈ కూటమిని భారత్ ప్రతిపాదించింది. ఏడు జంతువుల సంరక్షణకు ఉద్దేశించింది ఇది. పులి, సింహం, చిరుత పులి, మంచు చిరుత పులి, చీతా, జాగ్వార్, పూమా తదితర జంతువుల పరిరక్షణకు ఉద్దేశించింది ఈ వ్యవస్థ. వీటి పరిరక్షణలో భారత్ విశేష అనుభవాన్ని గడించింది. ఇందుకు ఇతర దేశాలతో పంచుకొనేందుకు సమాయత్తం అవుతుంది.
5. ఏ రాష్ట్రంలోని బిహు నృత్యం గిన్నిస్ రికార్డును సాధించింది? (2)
1) మిజోరం 2) అస్సాం 3) అరుణాచల్ ప్రదేశ్ 4) ఒడిశా
వివరణ: అస్సాంలోని బిహు నృత్యం గిన్నిస్ బుక్లో స్థానం సంపాదించింది. ఏకంగా 11,304 మంది ఈ న్యత్య ప్రదర్శనలో పాల్గొన్నారు. ఒకే ప్రదేశంలో ఇంత ఎక్కువ సంఖ్యలో బిహు నృత్యం చేయడం ఒక రికార్డ్. ఈ నృత్యాన్ని అస్సాం వాసులు మూడు ఉత్సవాల్లో ప్రదర్శిస్తుంటారు. రొంగాలి/బొహగ్ బిహు (ఏప్రిల్), బోగాలి/మాగ్ బిహు (జనవరి), కొంగాలి/కాతి బిహు (అక్టోబర్).
6. ఏ దేశానికి గోధుమల ఎగుమతికి ప్రపంచ ఆరోగ్య కార్యక్రమంతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది? (3)
1) ఇండోనేషియా 2) సూడాన్
3) అఫ్గానిస్థాన్ 4) శ్రీలంక
వివరణ: 10,000 మెట్రిక్ టన్నుల గోధుమలను అఫ్గానిస్థాన్కు సరఫరా చేసేందుకు ప్రపంచ ఆహార సంస్థతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రపంచ ఆహార సంస్థ ఇటలీలోని రోమ్ కేంద్రంగా పనిచేస్తుంది. అఫ్గానిస్థాన్లో వెనుకబడిన వివిధ ప్రజలు తీవ్ర ఆహార కొరతతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వారికి భారత్ సాయం అందిస్తుంది. దీన్ని ఇరాన్లోని చాహబర్ తీరం గుండా పంపిస్తుంది. ప్రపంచ ఆహార సంస్థను 1961లో స్థాపించారు. 2020లో ఈ సంస్థ నోబెల్ శాంతి బహుమతిని కూడా పొందింది.
7. ఆక్స్ఫర్డ్ మలేరియా వ్యాక్సిన్ను అనుమతిస్తున్న తొలి దేశం? (1)
1) ఘనా 2) లీచెన్స్టెయిన్
3) న్యూజిలాండ్ 4) ఫిజీ
వివరణ: ఆర్21/మ్యాట్రిక్స్-ఎం అనే మలేరియా వ్యాక్సిన్ను ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం తయారు చేసింది. దీన్ని ఘనా తమ దేశంలో ఇచ్చేందుకు అనుమతి ఇచ్చింది. ఈ తరహా నిర్ణయం తీసుకున్న తొలి దేశం ఘనానే. ఇది ఆఫ్రికా ఖండంలో ఉంది. ఈ వ్యాక్సిన్ 75% సామర్థ్యాన్ని కలిగి ఉంది. మలేరియా కట్టడిలో కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు.
8. బిర్సాముండా-జన్జాతీయ నాయక్ పుస్తకాన్ని ఎవరు రచించారు? (1)
1) అలోక్ చక్రవాల్ 2) రమేశ్ చంద్ర
3) దినేశ్ సంగి 4) ఎవరూ కాదు
వివరణ: బిర్సాముండా-జన్జాతీయ నాయక్ అనే పుస్తకాన్ని ప్రొఫెసర్ అలోక్ చక్రవాల్ రచించారు. ఆయన బిలాస్పూర్లోని గురు ఘాసిదాస్ విశ్వవిద్యాలయ వైస్ చాన్స్లర్. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. బిర్సాముండా పోరాటాన్ని అత్యంత సమర్థంగా, సమగ్రంగా ప్రజలకు తెలియచెప్పేందుకు ఉద్దేశించిన పుస్తకం ఇది. ముండా సామాజిక వర్గానికి చెందిన గొప్ప నాయకుడు బిర్సా ముండా. ఆయనకు ‘ధర్తీ ఆబా (ఫాదర్ ఆఫ్ ది ఎర్త్)’ అనే బిరుదు కూడా ఉంది. ఆయన 1875 నవంబర్ 15న జన్మించారు. ఆ రోజును జన్ జాతీయ గౌరవ్ దివస్గా నిర్వహిస్తారు. ఆయన పోరాట ఫలితంగానే చోటానాగ్పూర్ టెనెన్సీ చట్టం 1908లో వచ్చింది. నేటి రాజ్యాంగంలో తొమ్మిదో షెడ్యూల్లో దీన్ని చేర్చారు.
9. గోండ్ చిత్రకళ ఇటీవల వార్తల్లో నిలవడానికి కారణం ఏంటి? (3)
1) జాతీయ అవార్డును పొందింది
2) చిత్రకళపై సినిమా వచ్చింది
3) జీఐ ట్యాగ్ దక్కింది 4) పైవేవీ కాదు
వివరణ: మధ్యప్రదేశ్లోని గోండ్ చిత్రకళకు భౌగోళిక గుర్తింపు లభించింది. ఈ సామాజిక వర్గానికి చెందిన ఎందరో కళాకారులు అద్భుతమైన చిత్రాలను గీస్తారు. మధ్య భారత దేశంలో వీరి చిత్రకళ కనిపిస్తుంది. జానపద నృత్యాలు, పాటలు, వీరి చిత్రకళకు నేపథ్యంగా ఉంటాయి. డిగ్నా, బిట్టిచిత్రాల నుంచి గోండ్ చిత్రకళ ఆవిర్భవించింది. డిగ్నా అంటే ఇళ్లు, గోడలపై వేసే చిత్రాలు. సంప్రదాయబద్ధమైన రేఖ గణిత చిత్రాలను గీస్తారు. బిట్టిచిత్రాలను కూడా గోడపై గీస్తారు. వీటిలో ఎక్కువగా జంతువులు, చెట్ల బొమ్మలు ఉంటాయి. భోపాల్లోని భారత్ భవన్ మ్యూజియానికి జే స్వామినాథన్ డైరెక్టర్గా నియమితులైన తర్వాత ఆయన గోండుల గొప్ప చిత్రకళను వెలికితీశారు. జాన్ఘర్ సింగ్ శ్యామ్ గోండుల ప్రముఖ చిత్రకారుడు. అతని చిత్రాలను టోక్యో, పారిస్ వంటి నగరాల్లో ప్రదర్శించారు.
10. గ్యాలపాగోస్ దీవులు ఎక్కడ ఉన్నాయి? (4)
1) బ్రెజిల్ 2) అర్జెంటీనా
3) అమెరికా 4) ఈక్వెడార్
వివరణ: గ్యాలపాగోస్ దీవులు ఈక్వెడార్ దేశంలో ఉన్నాయి. ఇవి దక్షిణ అమెరికాకు పశ్చిమంలో 973 కిలోమీటర్ల దూరంలో నెలకొన్నాయి. పెద్ద సంఖ్యలో ఇక్కడ ప్రవాళాలు ఉన్న విషయాన్ని ఇటీవల గుర్తించారు. ఈ దీవులను 1978లో యునెస్కో జాబితాలో చేర్చారు. ఈ దీవులు కొకొప్లేట్, నాజ్కాప్లేట్, పసిఫిక్ ప్లేట్లు కలిసే చోట ఉన్నాయి. ఇక్కడ అత్యంత ఎత్తులో ఉండే పర్వతం అజుల్. దీని ఎత్తు 5541 మీటర్లు. ఎన్నో స్థానిక జాతులకు ఈ దీవులు నిలయం. ప్రముఖ శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ ఇక్కడ పరిశోధనలు కూడా చేశారు. పలు కొత్త జాతులను ఆయన ప్రస్తావించారు.
11. ప్రపంచ తొలి బౌద్ధమత సమావేశం ఏ నగరంలో నిర్వహించారు? (2)
1) కఠ్మాండు 2) న్యూఢిల్లీ 3) లుంబిని 4) టోక్యో
వివరణ: ప్రపంచ తొలి బౌద్ధమత సమావేశాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఏప్రిల్ 20న న్యూఢిల్లీలో ప్రారంభించారు. రెండు రోజుల పాటు ఇది కొనసాగింది. భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ దీన్ని ఏర్పాటు చేసింది. అంతర్జాతీయ బౌద్ధమత సమాఖ్య దీనికి సహకారం అందించింది. బౌద్ధమతానికి చెందిన ప్రముఖ తత్వవేత్తలు దీనికి హాజరయ్యారు. ఈ సమావేశపు ఇతివృత్తం ‘రెస్సాన్సెస్ టు కాంటెంపరరీ చాలెంజెస్: ఫిలాసఫీ టు ప్రాక్సిస్’. దాదాపు 30 దేశాల నుంచి 171 మంది ప్రతినిధులు హాజరయ్యారు. వివిధ బౌద్ధ మత సంఘాల నుంచి 150 మంది వచ్చారు. బుద్ధుడి బోధనలపై ప్రముఖంగా చర్చల సందర్భంగా పలువురు మాట్లాడారు. ఆధునిక కాలంలో బౌద్ధమత ప్రాధాన్యాన్ని వివరించారు.
12. ఏ అంశానికి సంబంధించి రూ.6003 కోట్లు కేటాయిస్తూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది? (3)
1) స్వచ్ఛ భారత్-2 2) పేదలకు రుణాలు
3) క్వాంటం మిషన్ 4) హర్ ఘర్ జల్
వివరణ: నేషనల్ క్వాంటం మిషన్కు రూ.6003 కోట్లు కేటాయిస్తూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. క్వాంటం సాంకేతికతను, దానికి అనుబంధంగా ఉండే అనువర్తనాలను అభివృద్ధి చేసేందుకు ఉద్దేశించింది ఇది. గణాంకాల్లో క్వాంటం మెకానిక్స్ను వినియోగించడమే ఈ పరిజ్ఞానం. సాధారణంగా 0 లేదా 1ని గణాంకాల ప్రాసెసింగ్లో వినియోగిస్తారు. క్వాంటమ్ సాంకేతికతలో 0తో పాటు 1ని కూడా వినియోగిస్తారు. ఈ ధర్మాన్నే క్యూబిట్స్ అంటారు. ఒకే సమయంలో, బహుళ గణాంకాలు చేసేందుకు ఇది వీలు కల్పిస్తుంది. క్వాంటం పరిజ్ఞానం అనేది వైద్య రంగంతో పాటు, రక్షణ, భద్రత వంటి అంశాల్లో కూడా వినియోగిస్తారు.
13. జాతీయ సాంకేతిక పరిశోధన సంస్థ (ఎన్టీఆర్వో)కు చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? (2)
1) అశోక్ కుమార్ 2) అరుణ్ సిన్హా
3) భూపాన్ హుడా 4) కల్యాణ్ సింగ్
వివరణ: జాతీయ సాంకేతిక పరిశోధన సంస్థకు చైర్మన్గా అరుణ్ సిన్హా నియమితులయ్యారు. ఆయన గతంలో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్నకు నేతృత్వం వహించారు. జాతీయ సాంకేతిక పరిశోధన సంస్థను ఇంగ్లిష్లో నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంటారు. దీన్ని 2004లో ఏర్పాటు చేశారు. సాంకేతిక అంశాల్లో నేరుగా ఇది ప్రధాన మంత్రికి సలహా ఇస్తుంది. భద్రతను మరింత పటిష్టం చేసే ఉద్దేశంతో ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. జాతీయ భద్రత సలహాదారులాంటిదే ఇది కూడా. కాకపోతే సాంకేతిక పరమైన అంశాలకు సంబంధించింది.
14) మిషన్ 50కే-ఈవీ4ఈసీవో అనే పథకాన్ని అమలు చేయనున్న వ్యవస్థ ఏది? (1)
1) ఎస్ఐడీబీఐ
2) పర్యావరణ మంత్రిత్వ శాఖ
3) అంతర్జాతీయ సౌర కూటమి
4) ఐడీబీఐ
వివరణ: పర్యావరణాన్ని మెరుగు పరిచేందుకు మిషన్ 50కే-ఈవీ4ఈసీవో ను ప్రారంభించింది. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంక్షిప్త రూపమే ఎస్ఐడీబీఐ. సూక్ష్మ, లఘు పరిశ్రమలకు రుణాలను ఇస్తుంది. ఈ బ్యాంక్ 50కే-ఈవీ4ఈసీవోను ప్రారంభించింది. ఇందులో భాగంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఎలక్ట్రానిక్ వాహనాలు, చార్జింగ్ చేసే మౌలిక సదుపాయాలను అందిస్తుంది. ముఖ్యంగా ద్వి, త్రిచక్ర వాహనాలపై ఇది దృష్టి సారిస్తుంది. సిడ్బీని 1990లో పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు.
15. ప్రభుత్వ శాఖల్లో 100% ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురానున్న రాష్ట్రం ఏది? (3)
1) ఉత్తరాఖండ్ 2) గుజరాత్
3) ఉత్తరప్రదేశ్ 4) రాజస్థాన్
వివరణ: 2030 నాటికి పూర్తిగా, అన్ని ప్రభుత్వ శాఖల్లో ఎలక్ట్రానిక్ వాహనాలను తీసుకురావాలని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ విభాగాలన్నీ ఈ తరహా వాహనాలనే వినియోగించనున్నాయి. దీన్ని పూర్తి చేస్తే, ఈ ఘనత దక్కించుకున్న తొలి రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అవుతుంది.
వి. రాజేంద్ర శర్మ
ఫ్యాకల్టీ
9849212411
RELATED ARTICLES
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు






